Global Warming | గ్లోబల్ వార్మింగ్తో విస్తరించే ప్రాణాంతక ఫంగస్! 33 శాతానికిపైగా మరణాల రేటు!
గ్లోబల్ వార్మింగ్ వల్ల మనిషి ఆరోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమించే ఫంగస్లు విస్తరిస్తాయని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ ఫంగస్ సోకిన వ్యక్తులలో కనీసం 33 శాతం మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఆస్పెర్గిల్లస్ ఫ్యూమిగాటస్ అనే ఫంగస్ విస్తరణకు వాతావరణం దోహదం చేస్తుందని పేర్కొన్నది.

Global Warming | రోజు రోజుకూ ధరిత్రి (Global Warming) వేడెక్కి పోతున్నది. ధృవాలు కరుగుతున్నాయి. సముద్ర జలాలు క్రమంగా వెచ్చబడుతున్నాయి. ఇవి అనూహ్యవాతావరణ పరిస్థితులకు దారి తీస్తున్నాయి. 2040 నాటికి ప్రపంచంలో కనీసం ముప్పై నగరాలు సముద్ర నీటిలో మునిగిపోతాయన్న హెచ్చరికలు శాస్త్రవేత్తల నుంచి వస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచ ఉష్ణోగ్రతల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం పరిస్థితిని నానాటికీ దారుణంగా దిగజార్చూతూ వస్తున్నది. దానికి తోడు యథేచ్ఛగా అటవీ సంపదను నాశనం చేస్తుండటంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటున్నది. ఇప్పటికే మూడు వరుస సంవత్సరాలు వేసవి తీవ్రతలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ పరిస్థితిని సరిదిద్దుకోకుంటే భూమిపై అనేక ప్రాంతాలు నివాసానికి అయోగ్యంగా మారిపోతాయని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్(Global Warming)తో శారరకంగా అనేక ఇబ్బందులు కలగడమే కాకుండా.. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రాణాంతక ఫంగస్
గ్లోబల్ వార్మింగ్ వల్ల మనిషి ఆరోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమించే ఫంగస్లు విస్తరిస్తాయని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ ఫంగస్ సోకిన వ్యక్తులలో కనీసం 33 శాతం మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఆస్పెర్గిల్లస్ ఫ్యూమిగాటస్ అనే ఫంగస్ విస్తరణకు వాతావరణం దోహదం చేస్తుందని పేర్కొన్నది. ఈ వైరస్ మనుషులకే కాకుండా, పశువులు, మొక్కలకు సైతం వ్యాపిస్తుందని తెలిపింది. దాని కారణంగా కలిగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ప్రాణాంతంగా మారుతాయని ఆ అధ్యయనం పేర్కొన్నది. ఈ అధ్యయనానికి డాక్టర్ నార్మన్ వాన్ రిజ్న్ నేతృత్వం వహించారు. ఈ ఫంగస్ ఆశ్చర్యం కలిగించేంత వేగంగా విస్తరిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నివేదిక పేర్కొంటున్నది. ఈ అధ్యయనంపై ఒక విశ్లేషణను ఫైనాన్షయల్ టైమ్స్ ప్రచురించింది. పంటలను సైతం ప్రభావితం చేసే ఈ ఫంగస్ 2100 నాటికి 16 శాతానికి పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. ఆస్పెర్గిల్లస్ ఫ్యూమిగాటస్ ఫంగస్ వల్ల మనుషుల్లో ఆస్తమా (ఉబ్బసం) తదితర రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులను ప్రభావితం చేసే ఆస్పెర్గిల్లస్ ఫ్యూమిగాటస్ 2100 నాటికి 77 శాతం వరకు వ్యాప్తి చెందుతుందని తెలిపింది. ప్రజలలో ఇన్వాసివ్ ఫంగస్ ఇన్ఫెక్షన్లకు ఆస్పెర్గిల్లస్ ఫ్యూమిగాటస్ ప్రధాన కారణమవుతుందని, అంతిమంగా ఆస్పెర్గిలోసిస్కు కారణమవుతుందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చెబుతున్నది. ఆస్పెర్గిల్లస్ కారణంగా కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స లేదని హెచ్చరిస్తున్నది. ఫలితంగా ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో మరణాల రేటు 33 శాతానికిపైగానే ఉంటుందని తెలిపింది.
ఎలా వ్యాపిస్తుంది?
ఫంగస్ ఉన్న బీజపరాగమాలను (spores) పీల్చిన వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులకు ఇది కారణమవుతుంది. మొదట్లో తలనొప్పి, నీరసం, దగ్గినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫంగస్ విస్తారంగా వ్యాప్తి చెందేందుకు వేడి వాతావరణం బాగా ఉపకరిస్తుందని ఎంఆర్సీ సెంటర్ ఫర్ మెడికల్ మైకోలజీ కో డైరెక్టర్ ఎలాయిన్ బిగ్నెల్ చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్లు 50 ఏళ్ల తర్వాత ఇలానే ఉండబోవని, రూపు మార్చుకుంటాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ నార్మన్ వాన్ రిజ్న్ చెప్పారు.
ఇక మనచేతిలోనే మన భవిష్యత్తు
శాస్త్రవేత్తల హెచ్చరికలు ఎల్లప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉంటాయి. ఆ భవిష్యత్తు మనది.. మన పిల్లలది. మన పిల్లలకు మంచి ఫూచర్ ఇవ్వాలని మనం ఎంతో సంపాదించి దాచి పెట్టడం లేదా ఇళ్లు కట్టించి ఉంచడం వంటివి చేస్తుంటాం. అయితే.. వారు మనం సంపాదించినదాన్ని వాడుకోవాలన్నా, మనం కట్టించిన ఇళ్లల్లో సుఖంగా జీవించాలన్నా అన్నింటికంటే ముఖ్యమైనది అద్భుతమైన పర్యావరణం. ప్రత్యేకించి కోట్లకు కోట్లు వెనకేసుకునేవారు ఆ కోట్ల రూపాయల ఆస్తులను మీ పిల్లలు అనుభవించాలంటే.. ముందుగా మీరు చేయాల్సిన పని.. పర్యావరణ పరిరక్షణ.
ఇవికూడా చదవండి..
Indo Pak War to Operation Sindoor | ఇండో – పాక్ వార్ టు ఆపరేషన్ సిందూర్.. భారత్ – పాక్ మధ్య యుద్దాలు, దాడులు ఇవే..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్.. ఆ 9 ఉగ్రవాద స్థావరాలనే భారత్ ఎందుకు టార్గెట్ చేసింది..?
Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?Universe End | ఆకాశ పెను తుఫాన్తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?