ఇ-కామర్స్ కంపెనీల దూకుడుకు కళ్ళెం
రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబువిధాత,న్యూఢిల్లీ, జూలై 30: ఇ-కామర్స్ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఇ-కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న అనుచిత వ్యాపార విధానాలపై వ్యాపారుల, రిటైలర్లు, పారిశ్రామిక సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి […]

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
విధాత,న్యూఢిల్లీ, జూలై 30: ఇ-కామర్స్ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఇ-కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న అనుచిత వ్యాపార విధానాలపై వ్యాపారుల, రిటైలర్లు, పారిశ్రామిక సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని తెలిపారు. అసాధారణ డిస్కౌంట్లు, అత్యంత తక్కువు రేట్లకు ఆన్లైన్లో ఉత్పాదనలు అమ్మకానికి పెట్టడం ద్వారా మార్కెట్పై సాధించిన ఆధిపత్యాన్ని ఇ-కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను లోతుగా విచారించి, పరిశీలించాల్సిందిగా సంబంధింత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు మంత్రి చెప్పారు.
ఇతరులెవరూ పోటీకి రాకుండా ఇ-కామర్స్ కంపెనీలు కొన్ని వాణిజ్య సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఆరోపిస్తూ కాంపిటీషన్ కమిషన్కు సైతం ఫిర్యాదులు అందినట్లు మంత్రి తెలిపారు. వీటిపై కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. నూతన ఇ-కామర్స్ విధానం ద్వారా ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే ఇ-కామర్స్ కంపెనీలకు కళ్ళెం వేస్తామని మంత్రి చెప్పారు. ఫ్లాష్ సేల్స్ వంటి ఆకర్షణలతో ఇ-కామర్స్ సంస్థలు అనుచిత వ్యాపార పద్ధతులకు పాల్పడకుండా నిరోధించేందుకు వినియోగదారుల పరిరక్షణ(ఇ-కామర్స్) నిబంధనలను సవరించడానికి ముందుగా ప్రభుత్వం వాటిపై వ్యాపార వర్గాల సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్సైట్లో పెట్టినట్లు ఆయన తెలిపారు.