ఎంతో చర్చించాకే బోర్డుల పరిధి నిర్ణయించాం
విధాత,న్యూ ఢిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని.. అన్ని అంశాలు,అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు.బోర్డుల పరిధి,నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గెజిట్పై కేంద్ర జల్శక్తి శాఖ అధికారులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు.గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించారు.‘‘విభజన చట్టం ప్రకారం తెలుగు […]

విధాత,న్యూ ఢిల్లీ: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని.. అన్ని అంశాలు,అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు.బోర్డుల పరిధి,నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గెజిట్పై కేంద్ర జల్శక్తి శాఖ అధికారులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు.గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించారు.
‘‘విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుంది. సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జల్శక్తి శాఖ, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు. 2016లో తొలిసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. ఆ సమయంలో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ మరోసారి భేటీ అయింది. 2014 నుంచి బోర్డుల పరిధిపై కసరత్తు జరుగుతోంది. సీడబ్ల్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నాం. ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశాం. ఏపీ పునర్ విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకున్నాం.
నోటిఫికేషన్ ప్రకారం బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోగా రూ.200 కోట్లు చొప్పున డిపాజిట్ చేయాలి.బోర్డుల నిర్వహణ, నిధులు, వనరుల కొరత రాకూడదు. ఏది ఆమోదం పొందిన ప్రాజెక్టో.. ఏది ఆమోదం పొందలేదో గెజిట్లో నిర్వచించాం. బి-పార్ట్ షెడ్యూల్లో ఉన్నంత మాత్రాన ఆమోదం పొందినట్లు భావించొద్దు. నోటిఫికేషన్లోని షెడ్యూల్-2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే ఉంటుంది. షెడ్యూల్-3లో ఇప్పుడు ఉన్నట్లే రాష్ట్రాల పర్యవేక్షణ కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి బోర్డుల సూచన మేరకే నిర్ణయాలు తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల అవసరాలు, ప్రతిపాదనల మేరకు నీటి విడుదల ఉంటుంది. నీటి వాటా పంపిణీ అంశం చాలా సున్నితమైంది. ప్రతి చిన్న విషయాన్ని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయం తరలింపు వ్యవహారమే నిదర్శనం. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య, ఏకాభిప్రాయమే అతిపెద్ద సవాల్. ట్రైబ్యునళ్ల పంపిణీ ప్రకారమే నీటి కేటాయింపులుంటాయి. ఉమ్మడి ఏపీకి ఇప్పటికే నిర్దిష్టమైన కేటాయింపులు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఇరు రాష్ట్రాలకు నీటి పంపిణీ ఉంటుంది’’ అని అధికారులు వివరించారు.