Drumstick Farming | మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా( Solapur District )లోని పంఢర్పూర్ కరువు( Drought ) పీడిత ప్రాంతం. నీటి వనరులు చాలా తక్కువ. అయినప్పటికీ ఇక్కడున్న రైతులంతా చెరుకును పండిస్తారు. కానీ ఉద్ధవ్ గోవర్ధన్ కౌలాగే( Uddhav Govardhan Kaulage )అనే రైతు మాత్రం చెరుకు స్థానంలో మునగకాయలు పండించాలని నిర్ణయించుకున్నాడు. మునగకాయల సాగు( Drumstick Farming ) చేస్తూ లక్షాధికారి అయ్యాడు. ఎకరాకు రూ. 6 లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేకాదు.. ఐదు ఎకరాల్లో పండించిన మునగకాయలతో పాటు మునగ విత్తనాలను విక్రయిస్తూ ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.. నిలుస్తున్నాడు.
పిరాచీ కురోలి గ్రామానికి చెందిన అతని కుటుంబం ఉన్న ఐదెకరాల పొలంలో తరతరాలుగా చెరుకునే సాగు చేస్తున్నారు. కానీ ఆశించినంత లాభాలు రావడం లేదు. చెరుకు పండించేందుకు నీటి వినియోగం కూడా ఎక్కువనే. షుగర్ ఫ్యాక్టరీల నుంచి చెల్లింపులు కూడా సరిగా ఉండేవి కావు. ఎకరం చెరుకు పండిస్తే.. కేవలం రూ. 50 వేలు మాత్రమే ఆదాయం వచ్చేది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ గోవర్ధన్ మునగసాగును ఎంచుకున్నాడు.
జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క వీడియో
అయితే 2021లో యూట్యూబ్లో మునగ సాగుకు సంబంధించి ఓ వీడియో చూశాడు ఉద్ధవ్. మునగకాయల్లో, వాటి ఆకులు, విత్తనాల్లో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నాయని తెలుసుకున్నాడు. దీంతో మార్కెట్లో కూడా మునగకాయ, ఆకుకు భారీ డిమాండ్ ఉందన్న విషయాన్ని గ్రహించాడు. ఇక మునగ పంట కరువును కూడా తట్టుకుంటుంది. తక్కువ నీటి వినియోగం ఉంటుంది. అధిక దిగుబడిని ఇస్తుంది. ఏడాది పొడవునా కూడా మునగ కాయలను ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి మొత్తానికి ఉద్ధవ్ మునగ మీద దృష్టి సారించాడు.
ఐదు నెలల్లోనే దిగుబడి
2022లో స్థానిక రైతు నుంచి ఓడీసీ-3 రకానికి సంబంధించిన మునగ విత్తనాలను సేకరించాడు. అయితే దిగుబడి తక్కువగా ఉండడంతో.. మేలైన రకాలను సేకరించి, సాగు చేయాలనుకున్నాడు. ఒడిశాలోని ఖోర్ధా రకం విత్తనాలను సేకరించాడు. ఈ విత్తనాలు అధిక దిగుబడిని ఇస్తాయి. దీంతో ఒక నర్సరీ నుంచి కిలో విత్తనాలకు రూ. 15 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేశాడు. ఇక ఓడీసీ-3 రకం చెట్లను తొలగించాడు. వాటి స్థానంలో ఎకరానికి అర కిలో విత్తనాలను నాటాడు. మొత్తానికి ఆశించిన ఫలితం వచ్చింది. దిగుబడి అధికంగా ఉంది. ఐదు నెలల్లోనే దిగుబడి రావడంతో.. ఈ మునగసాగును ఎకరం నుంచి ఐదు ఎకరాలకు విస్తరించాడు.
ఎకరానికి 25 టన్నుల మునగకాయలు
ఉద్ధవ్ ఎకరానికి 25 టన్నుల మునగకాయలు పండిస్తున్నాడు. దీంతో ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. నీటి పారుదలకు, ఎరువులు, వ్యవసాయ కూలీల ఖర్చులు పోనూ సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లాభాలు పొందుతున్నాడు ఉద్ధవ్.
వార్షిక ఆదాయం రూ. 30 లక్షలు
ఐదు ఎకరాల్లో అతని వార్షిక ఆదాయం రూ. 30 లక్షలు కాగా, ఇందులో మునగ విత్తనాలు అమ్మడం వల్ల రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. అయితే మొదటి మూడు నెలల వరకు మాత్రమే మునగకు నీరు అవసరం. ఆ తర్వాత నీటి పారుదల చాలా తక్కువగా అవసరం ఉంటుంది. అంటే చెరుకు పంటతో పోల్చితే మునగ పంటకు నీటి వినియోగం తక్కువనే చెప్పొచ్చు.
పదేండ్ల వరకు దిగుబడి..
ఇక మునగ మొక్కలు పదేండ్ల వరకు దిగుబడిని ఇస్తూనే ఉంటాయి. తొమ్మిదేండ్ల పాటు గరిష్ట దిగుబడులను ఇస్తాయి. దాంతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుంది.
ఆర్థిక ఊతమిస్తున్న మునగసాగు : ఉద్ధవ్
పండించిన మునగకాయలను కర్ణాటకలోని బెల్గాం, మహారాష్ట్రలోని ముంబై, పుణెలలో విక్రయిస్తున్నాడు. చెరుకు పంటకు అయితే చెల్లింపులు ఆలస్యంగా జరిగేవి. అదే మునగ విషయంలో అయితే మునగకాయలు మార్కెట్లో అమ్ముడు పోయిన క్షణాల్లోనే నగదు వస్తుంది. ఇది ఆర్థిక తోడ్పాటుకు ఊతమిస్తుంది అని ఉద్ధవ్ పేర్కొన్నాడు.
