–స్వాతంత్ర్య దినోత్సవం నాడే బీటెక్ విద్యార్థిని రమ్యపై ఘాతుకం తీవ్రంగా కలచివేసింది
-రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో మహిళలకు కరువైన భద్రత
-దిశచట్టం పేరుతో ప్రచారంపై పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణపై చూపని ప్రభుత్వం
-టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు
విధాత:గుంటూరు జిల్లా కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్య చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా బయటకు రాగలిగినప్పుడు అసలైన స్వాతంత్ర్యం అని గాంధీ మహాత్ముడు శతాబ్దాల క్రితం అంటే.. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అరాచకపాలనలో పట్టపగలు ఆడపిల్ల సొంత ఇంట్లోనైనా భద్రంగా వుండగలిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని మహిళాలోకం భయం భయంగా బతుకుతోందన్నారు. స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న రోజునే గుంటూరు జిల్లా నడిరోడ్డు మీద బీటెక్ విద్యార్థిని రమ్యని అత్యంత కిరాతకంగా హతమార్చడం వైసీపీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భధ్రతలు సమర్ధవంతంగా నిర్వహించినప్పుడే ఆ రాష్ట్రం సమగ్రాభివృద్ది చెందుతుందని, జగన్ పాలనలో అరాచకం వికృత రూపం దాల్చడంతో పరిస్థితులన్నీ అధ్వానంగా మారాయన్నారు. గడిచిన రెండేళ్లలో 500కిపైగా మహిళలపై దాడులు, అత్యాచారఘటనలు జరిగాయని, నేటికీ చాలా కేసుల్లో నిందితులని పట్టుకోలేకపోవడం, ప్రభుత్వం చేతకానితనమా? నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందా? అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని సీతానగరంలో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుణ్ణి పట్టుకోలేకపోవడానికి కారణమేంటని నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపితే నేటికీ ఆ కేసులో పురోగతి లేకపోవడం విచారకరమన్నారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువగా దళిత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా, స్పందించకపోవడానికి ఆమె షాడో హోంమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారడమే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే నివాసం వుంటున్న దళిత మహిళల మానప్రాణాలకు రక్షణలేదు, సీఎం సొంత నియోజకవర్గంలో దళిత మహిళపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటంలేదు, ఏకంగా ముఖ్యమంత్రి చెల్లెలు సునీతారెడ్డి తనకు ప్రాణహాని వుందని పోలీసులకు ఫిర్యాదు చేసిందంటే..ఇక సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరకుతుందని ప్రశ్నించారు. మహిళలకు భద్రత కల్పించడం అంటే… ప్రచారం కోసం కోట్లు ఖర్చుపెట్టి సొంత పేపరుకి ఫేక్ ప్రకటనలు ఇవ్వడం, దిశలాంటి గాలి చట్టాలు, ఖాళీ జీవోలివ్వడం కాదని ఎద్దేవ చేశారు. రమ్యని అత్యంత దారుణంగా చంపిన హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.