Justice BR Gavai| రాజ్యాంగ హక్కులపై అందరికి అవగాహన ఉండాలి : జస్టిస్ బీఆర్.గవాయ్

రాజ్యాంగ హక్కులపై ప్రజలందరికి అవగాహాన ఉండాలని సుప్రీంకోర్ట చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అమరావతి : రాజ్యాంగ హక్కులపై ప్రజలందరికి అవగాహాన ఉండాలని సుప్రీంకోర్ట చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ మాట్లాడుతూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారన్నారు. 1975 వరకు ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని.. కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన ప్రసంగం.. ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని సూచించారు.

సవరణల అవశ్యకతను గుర్తించే నిబంధనలు

రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని గవాయ్ తెలిపారు. మార్పు అంశం ప్రాధాన్యతను మేరకు సవరణ విధానాలను పొందుపరిచారని, కొన్ని అంశాల్లో సవరణ సులభం.. కొన్ని అంశాల్లో చాలా కఠినంగా పెట్టారని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నాం అని గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని, కేశవానంద భారతి కేసులో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్‌ విధానం ఉండాలన్నది నా అభిప్రాయం అని గవాయ్ తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని.. కొన్నేళ్లుగా మహిళలు న్యాయ విద్యలో బాగా రాణిస్తున్నారని ప్రశంసించారు.