ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం కోసం నారా..నందమూరి కుటుంబ సభ్యులంతా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. టీడీపి అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు
జనంతో మమేకమవుతున్న మహిళా మణులు
విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం కోసం నారా..నందమూరి కుటుంబ సభ్యులంతా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. టీడీపి అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేశ్, బాలకృష్ణలు ఒకవైపు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తుండగా, తామేమి తక్కువ కాదన్నట్లుగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచార గోదాలో సందడి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ గెలుపు కోసం ఆయన సతీమణి బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఎర్రబాలెంలో కారం తయారీ పరిశ్రమ మహిళా కార్మికులతో, బేతపూడిలో పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం టీడీపీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు విజయం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజవర్గంలో ప్రచారం సాగిస్తూ వివిధ వర్గాల ప్రజలతో భేటీ అవుతూ టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఇక హిందూపురంలో పోటీ చేస్తున్న బాలకృష్ణను గెలిపించాలని ట్విటర్ వేదికగా దివంగత తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కోరారు. ఆమె వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సన్నిహిత బంధువు అయినప్పటికి ఎన్నికల పోరులో తన కుటుంబం వైపే ఉంటానని, మామయ్య బాలకృష్ణ గెలుపు కోరుకుంటున్నానని వెల్లడించారు.