ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు పరిసర గ్రామాల్లో నెల రోజులుగా పంటలను ధ్వంసం చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అడవి ఏనుగును అటవీ శాఖ అధికారులు విజయవంతంగా బంధించారు. ఒంటరి ఏనుగును బంధించేందుకు పలమనేరు అటవీశాఖ డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ఐదు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు, వన్యప్రాణి నిపుణుల సహకారంతో నెల రోజుల పాటు ప్రత్యేకంగా “ఆపరేషన్ టస్కర్” ను చేపట్టారు. కుంకి ఏనుగుల సహాయంతో ఒంటరి ఏనుగును సురక్షితంగా బంధించారు. వారం రోజులుగా పక్కా ప్రణాళికతో సాగిన ఆపరేషన్ విజయవంతం కావడంతో అధికారులతో పాటు బాధిత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
కొన్ని నెలలుగా గ్రామాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఘంటవూరు, పెంగరగుంట, గుబ్బిళ్లకొత్తూరు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఎట్టకేలకు ఒంటరి ఏనుగు పట్టుబడటంతో స్థానికులు అటవీ అధికారులను అభినందిస్తున్నారు. పట్టుబడిన ఏనుగును ముసలమడుగు ఏనుగుల పునరావస,శిక్షణా శిబిరానికి తరలించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు బంధం.
5 కుంకీ ఏనుగుల సాయంతో మాటు వేసి, మత్తు ఇంజక్షన్ ఇచ్చి గజరాజును పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. pic.twitter.com/YnqqvxFuOr
— YK Tv Digital (@yktvdigital) July 17, 2026
