Raipur Visakhapatnam Highway | భారీ వంతెనలు, టన్నెల్స్‌తో అద్భుతమైన రహదారి.. విశాఖ-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎలా ఉందో చూశారా!

Raipur Visakhapatnam Highway | విశాఖపట్నం - రాయ్‌పూర్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హైవేకు సంబంధించిన డ్రోన్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

Raipur Visakhapatnam Highway | ఉత్తరాంధ్రవాసుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ మధ్య చేపట్టిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు ఆరు గంటల వరకు తగ్గనుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర వాణిజ్యపరంగా ఎదిగే అవకాశం ఉంది. కాగా, భారతమాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కావచ్చిన తరుణంలో ఈ హైవేకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ 464 కిలోమీటర్ల పొడవున ఈ హైవేను నిర్మిస్తున్నారు. దీనివల్ల వైజాగ్ నుంచి రాయ్‌పూర్‌కు 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా 12 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గనుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే విశాఖపట్నం శివారు సబ్బవరం వద్ద కోల్‌కతా జాతీయ రహదారి వద్ద మొదలై.. విశాఖపట్నం, విజయనగరం, మన్యం జిల్లాల మీదుగా వెళ్తుంది. ఏపీలో 100 కిలోమీటర్ల మేర నాలుగు ప్యాకేజీలుగా, ఒడిశాలో 241 కి.మీ. మేర 11 ప్యాకేజీలుగా, చత్తీస్‌గఢ్‌లో 124కి.మీ. మేర మూడు ప్యాకేజీలుగా కలిపి మొత్తం 464కి.మీ. ఈ రహదారిని 18 ప్యాకేజీలుగా పూర్తి చేస్తున్నారు.

 


ఏపీలో ఇప్పటికే 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్యాకేజీల్లో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. మిగిలిన పనులన్నీ ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో 100కి.మీ. పొడవున ఈ రహదారి నిర్మాణానికి రూ.3వేల కోట్లు వెచ్చించారు. విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ వరకు హైవే నిర్మాణానికి సుమారు 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఇక ఈ కారిడార్‌లో భాగంగా ఆరు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. ట్విన్ రోడ్డు టన్నెల్స్, ఎత్తయిన భారీ వంతెనలు, ఇంటర్‌చేంజ్‌లతో నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సొరంగ మార్గాల నిర్మాణం, ఎత్తయిన ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైరల్‌ అవుతున్న డ్రోన్ దృశ్యాల్లో కొన్ని ప్రాంతాలు విదేశాల్లో కనిపించే పర్వత ప్రాంత ఎక్స్‌ప్రెస్‌ వేను తలపిస్తున్నాయని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.

 


కాగా, ఆరు వరుసలతో నిర్మిస్తున్న ఈ రహదారికి సర్వీస్ రోడ్లు ఉండవు. ఏపీ పరిధిలో కేవలం ఆరు చోట్ల మాత్రమే హైవేలోకి ప్రవేశించేందుకు లేదా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ లభిస్తుంది. ముఖ్యంగా రాయ్‌పూర్ నుంచి వైజాగ్‌కు ప్రస్తుతం 12 గంటల సమయం పడుతుంటే.. ఈ రహదారి నిర్మాణం పూర్తయ్యాక కేవలం ఆరు గంటల్లోనే రావచ్చు. దీనివల్ల కనెక్టివిటీ పెరిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి లభించనుంది.

Read More:

Self Driving Truck | హైవేలపై సరికొత్త విప్లవం.. డ్రైవర్లు లేకుండా ఏఐతో రోడ్లపై పరుగులు పెట్టే ట్రక్కులు.. వీటితో లాభమా? నష్టమా?

Traffic Restrictions | నేటి నుంచి హైద‌రాబాద్ – ముంబై హైవేపై ట్రాఫిక్ ఆంక్ష‌లు

Latest News