ఇక జీవోలు కనపడవు
ప్రభుత్వ ఉత్తర్వుల్ని వెబ్సైట్లో ఉంచరాదని సర్కారు నిర్ణయంవివిధ శాఖలకు ఆదేశాలు జారీ2008 నుంచి అమలవుతున్న ఆన్లైన్ విధానానికి తిలోదకాలువిధాత,అమరావతి: ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లను ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2008 నుంచి ప్రభుత్వం జీవోలను వెబ్సైట్లో ఉంచుతోంది. తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు కనపడవు. ప్రభుత్వం జీవోల్ని ఉంచే ‘గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టరులో (జీఓఐఆర్)’ జీవో నంబర్లు జనరేట్ చేసే విధానాన్ని ఇకపై అనుసరించవద్దని, అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులు […]

ప్రభుత్వ ఉత్తర్వుల్ని వెబ్సైట్లో ఉంచరాదని సర్కారు నిర్ణయం
వివిధ శాఖలకు ఆదేశాలు జారీ
2008 నుంచి అమలవుతున్న ఆన్లైన్ విధానానికి తిలోదకాలు
విధాత,అమరావతి: ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లను ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2008 నుంచి ప్రభుత్వం జీవోలను వెబ్సైట్లో ఉంచుతోంది. తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు కనపడవు. ప్రభుత్వం జీవోల్ని ఉంచే ‘గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టరులో (జీఓఐఆర్)’ జీవో నంబర్లు జనరేట్ చేసే విధానాన్ని ఇకపై అనుసరించవద్దని, అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులు దీనికి అనుగుణంగా వ్యవహరించాలని సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు సోమవారం లేఖ పంపించారు. ‘ఇకపై జీవోలకు నంబర్లు కేటాయించడం, వాటిని ప్రదర్శించడం ఏపీ సచివాలయం ఆఫీసు మాన్యువల్, ప్రభుత్వ బిజినెస్ రూల్స్కు అనుగుణంగానే జరగాలి’ అని లేఖలో స్పష్టం చేశారు.
బ్లాంక్ జీవోలతో మొదలుపెట్టి
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి బ్లాంక్ జీవోలు ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే ‘జీవోఐఆర్’ వెబ్సైట్లో జీవో నంబరు ఇచ్చినా.. అందులో ఎలాంటి సమాచారం లేకుండా ఖాళీగా ఉంచుతున్నారు. ముఖ్యంగా సాధారణ పరిపాలనశాఖ ఈ 16 రోజుల్లో 82 జీవోలు జారీ చేస్తే.. వాటిలో 49 బ్లాంక్గా ఉంచింది. మరో నాలుగు జీవోల్ని ‘కాన్ఫిడెన్షియల్’గా పేర్కొని, వాటినీ రహస్యంగా ఉంచింది. న్యాయశాఖ రెండు, అటవీశాఖ ఒక ఖాళీ జీవోలను ప్రదర్శించాయి. గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా సహా కొందరు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ, కొందరికి కొన్ని శాఖలకు ఇన్ఛార్జులుగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో (నం.1334) జారీ చేసింది. దాన్ని ‘బ్లాంక్’గానే పెట్టారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్గా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్నీ బదిలీ చేసింది. ఈ నిర్ణయాలు ప్రజలకు తెలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటో? వాటిని ఎందుకు రహస్యంగా ఉంచాలనుకుంటోందో అంతు చిక్కడం లేదు. ‘బ్లాంక్’ జీవోల అంశాన్ని తెదేపా నాయకులు ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు.
యంత్రాంగంపై భారం జీవోలను ఆన్లైన్లో ఉంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఎవరికి జీవో కావాలన్నా.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయాల్సి వస్తుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు సమాధానం చెప్పడానికి ప్రతి శాఖా కొందరు ఉద్యోగుల్ని పూర్తి స్థాయిలో కేటాయించాల్సి రావచ్చని అభిప్రాయపడుతున్నారు. ‘ఈ ఆధునిక కాలంలో సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం దాచిపెట్టడం సరికాదు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని డాక్యుమెంటేషన్, ఇండెక్సింగ్ చేసి అందుబాటులో ఉంచాలని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్-4 చెబుతోంది. అది ఇంతవరకు జీఓఐఆర్ రూపంలో సచివాలయంలోనే పక్కాగా అమలవుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ నిబంధనకు విఘాతం కలుగుతుంది’ అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
ఎందుకీ గోప్యత?
గతంలో జీవోల నంబర్ల నమోదుకు సచివాలయంలోని ప్రతి విభాగంలో ప్రత్యేక రిజిస్టర్ ఉండేది. ఆ సిరీస్లో వచ్చిన నంబరుతో జీవో జారీ చేసేవారు. సంబంధీకులకు జీవో కాపీల్ని పంపించేవారు. ప్రభుత్వం జీవో ఇచ్చాక రెండు, మూడు రోజులకే వారికి అందేది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, బదిలీల వంటి విషయాలకు సంబంధించిన జీవోల్లోని సమాచారం పత్రికల ద్వారా ప్రజలకు తెలిసేది. ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వం 2008 నుంచీ ప్రతి జీవోనూ ‘జీఓఐఆర్’ వెబ్సైట్లో ఉంచుతోంది. విషయం ముందే తెలిస్తే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని భావించి, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు వంటి అంశాల్ని గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) ఉంచేది. మావోయిస్టులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఉత్తర్వుల్లోనూ ఇదే గోప్యత పాటించేవారు. అలాంటివి ఎప్పుడైనా ఒకటో రెండో మాత్రమే ఉండేవి. ఈ పన్నెండేళ్లలో ‘జీఓఐఆర్’పై ఎలాంటి ఫిర్యాదులూ లేవు.
ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ ప్రాజెక్టులు, పథకాలకు చేసే కేటాయింపులు, మార్గదర్శకాలు, విధివిధానాలన్నీ జీవో జారీ చేసిన వెంటనే ప్రజలకు తెలిసేవి. సెల్ఫోన్లో జీవో డౌన్లోడ్ చేసి చూసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవడం, వాటిపై కోర్టుల్లో సర్కారుకు చుక్కెదురవుతున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సమాచారమే తెలియకుండా చేస్తే ఈ సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తోందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.