జగన్ పడేసిన కుక్క బిస్కెట్లు తినేవాళ్లే నా మీద వెయ్యి కోట్లు అని నిందలు వేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నారు
అన్న జగన్కు సవాల్ విసిరిన చెల్లి వైఎస్ షర్మిల
విధాత: జగన్ పడేసిన కుక్క బిస్కెట్లు తినేవాళ్లే నా మీద వెయ్యి కోట్లు అని నిందలు వేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం కడపలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి వాళ్లు వేయి కోట్లేమిటీ పదివేల కోట్ల వర్క్లు అడిగానని కూడా చెపుతారన్నారు. తాను జగన్ను ఒక్కపైస సహాయం కూడా అడగలేదని నిరూపిస్తే రాజకీయాలు వదలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ముందు ఇలా మాట్లాడుతున్నందుకు మీకు ఎంత అందుతున్నాయి చెప్పండి ? అని ప్రశ్నించారు. వీళ్ళు ఊసరవెల్లులని ఆరోపించిన షర్మిల అవసరానికి వాడుకొని, అవసరం తీరాక పుట్టుకనే అనుమనిస్తారన్నారు.
తల్లి విజయమ్మ పై సైతం నిందలు వేశారన్నారు. మీరంతా ఒక సారి ఆలోచన చేయండి… ఇదే జగన్ మోహన్ రెడ్డి వైఎస్ ఆర్ మరణం వెనుక రిలియన్స్ హస్తం ఉందని అంటే… అందరు నమ్మి…ఆ సంస్థపై దాడులు కూడా చేసి, కేసులో కూడా ఇరుకున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి వివేకా హత్య తర్వాత సీబీఐ విచారణ అడిగిన జగన్ సీఎం అయ్యాక విచారణ వద్దన్నారని తెలిపారు. సొంత తండ్రి పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిన ఘనత జగన్ దన్నారు. అవినాష్ రెడ్డి నా భర్త అనిల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ల్యాండ్ క్రూజర్లో వెళ్లి కలిశాడని ప్రచారం చేస్తున్నారని, అవినాష్ రెడ్డి లాగ మధ్య రాత్రి గొడ్డలితో వెళ్ళడం మాకు చేతకాదన్నారు. అనిల్ కు ఏ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.