Delhi liquor case l
విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam case)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోకి ఉదయం 11:30 గంటలకు వెళ్లిన కవిత.. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య విచారణకు బ్రేక్ ఇచ్చారు.
ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జాయింట్ డైరెక్టర్ అధికారి నేతృత్వంలో పీఎంఎల్ఏ 50(2) ప్రకారం అనుమానితురాలిగా ఈడీ అధికారులు కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అభియోగాలపై ఆమె నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఈడీ విచారణ ముగిసిన అనంతరం తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి కవిత బయల్దేరి వెళ్లారు.
ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేశారు. అభియోగాలపై లిఖితపూర్వక వివరణ తీసుకున్నట్లు సమాచారం. అరుణ్ పిళ్లై(Arun Pillai)తో కలిపి కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాలపైన, ఆధారాలు ధ్వంసం చేశారనే అభియోగాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా డిజిటల్ ఆధారాలు లభించకుండా చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన సమావేశాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. కేజ్రీవాల్ (Kejriwal), మనీష్ సిసోడియా (Manish Sisodia ) తో జరిగిన భేటీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
గంటల తరబడి ఈడీ విచారణ కొనసాగడంతో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ నెలకొన్నది. ఆమెను అరెస్టు చేస్తారనే వార్తలు రావడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్దకు చేరుకోకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ ముగిసిన తర్వాత తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ నివాసానికి కవిత వెళ్లారు. అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు.
దుమారం రేపిన పోస్టర్లు, ఫ్లెక్సీలు
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కు హాజరైన వేళ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పలు పోస్టర్లు, ఫ్లెక్సీలు రాజకీయ దుమారాన్నిరేపుతున్నాయి. బీజేపీలో చేరకముందు చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫొటోలతో నగరంలో ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ సోదాలు చేపట్టగానే కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారని ఫ్లెక్సీలో విమర్శించారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, పశ్చిమ బెంగాల్ ముఖ్యనేత సువేంధు అధికారి, ఏపీకి చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణెలతో పోలుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం తనిఖీలకు ముందు, తర్వాత ఏ మరక లేకుండా ఉన్నారంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్కు కవిత తిరుగుపయనం
ఈడీ విచారణ ముగియడంతో కవిత హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ప్రత్యేక విమానంలో కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నెల 16 మరోసారి విచారణ రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ అదికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.