Holi Festival | ఆధ్యాత్మిక దేశం భారతదేశం. ఇక్కడ పండుగలు ప్రజల జీవితాలతో మమేకమై ఉన్నాయి. ఏడాది పొడువునా అనేక విభిన్నమైన పండగలను జరుపుకుంటూ వస్తారు. ఒక్కో ప్రాంతంలో పండుగకు ఎంతో విశిష్టత ఉంటుంది. యావత్ దేశంతో కీలకమైన పండుగలలో హోలీ ఒకటి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఎక్కడ చూసినా రంగులతో హోలీ జరుపుకుంటారు. మరికొన్ని చోట్ల పూలతో జరుపుకుంటారు. కానీ, ఒక ప్రదేశంలో మాత్రం చితాభస్మంతో హోలీని జరుపుకుంటారు. ఇంతకీ హోలీని చితాభస్మంతో ఎక్కడ జరుపుకుంటారు.. ఎందుకిలా జరుపుకుంటారో తెలుసుకుందాం రండి..
హోలీ అంటేనే రంగుల పండుగ. చాలా మంది రంగులతో పాటు టమాటలు, కోడిగుడ్డతో వేడుకలు చేసుకోవడం చూసే ఉంటారు. కానీ, ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రంలో ఇక్కడ లడ్డూలు, పూలు, కర్రలతో హోలీ పండుగ నిర్వహించడంతో పాటు చితాభస్మంతో హోలీ విభిన్నంగా జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వేడుకలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తారు. ఈ హోలీ వేడుకను మణికర్ణిక ఘాట్లో ప్రత్యేకంగా జరుగుతాయి. దీన్నే ‘మసాన్ కి హోలీ’ అంటారు. మణికర్ణికా ఘాట్ వద్ద సాధువులు, శివ భక్తులు మృతదేహాలను దహనం చేసిన బూడిదతో హోలీ ఆడుతారు. హోలీకి ముందు మణికర్ణిక ఘాట్లో మసాన్ హోలీ ఆడతారు. ఈ మసాన్ హోలీ వారణాసిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పండుగ మణికర్ణికా ఘాట్ వద్ద శ్మశాన వాటిక వద్ద శివయ్యను అలంకరించడం, బూడిదను సమర్పించడంతోనే ఆరంభవుతుంది.
రంగభారీ ఏకాదశినే పరమశివుడు పార్వతీదేవిని గౌణాన్ని ప్రదర్శించిన తర్వాత తొలిసారిగా కాశీకి తీసుకువచ్చాడని భక్తుల విశ్వాసం. ఆ రోజున భక్తుల పార్వతిదేవిపై రంగులు, గులాల్, రంగురంగుల పూలను జల్లుతూ స్వాగతం పలికారని.. శివ భక్తులు ఆ రోజున కాశీ విశ్వనాథుడిని.. తల్లి పార్వతికి రంగులను, పువ్వులను సమర్పిస్తూ హోలీ ఆడారని విశ్వాసం. అందుకే దీన్ని రంగభారీ ఏకాదశి అంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆ రోజున దెయ్యాలు, పిశాచాలు, జీవులు మొదలైన వాటితో గులాల్తో హోలీ ఆడలేకపోయాడు. రంగభారీ ఏకాదశి అనంతరం పరమేశ్వరుడు శ్మశానవాటికలో తన బృందంతో కలిసి మాసన్ హోలీ ఆడాడు. అప్పటి నుంచి చితా భస్మ హోలీని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైనట్లుగా చెబుతారు. మణికర్ణిక ఘాట్లో మసాన్ హోలీని ప్రత్యేకంగా జరుపుతారు.
ఉదయం నుంచి హోలీ ఇక్కడ ప్రారంభమవుతుంది. సాధువులు, శివభక్తుల బృందం శివుడిని పూజించి హవనాన్ని నిర్వహిస్తారు. భజన, కీర్తనలతో పాటు నృత్యాలు చేస్తారు. అనంతరం చితాభస్మంతో హోలీ ఆడతారు. మసాన్ హోలీ వేడుక భక్తులకు మరణాన్ని దుఃఖంగా కాకుండా మోక్షం పొందే మార్గంగా చూడమని చెబుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ వేడుకలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తారు.