పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 4 వికెట్ల తేడా గెలిచి కప్ వేట మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ (77: 49 బంతుల్లో) అర్ధశతకంతో చెలరేగగా, చివర్లో దినేశ్ కార్తీక్(28), లామ్రోర్ (17*) జట్టును విజయతీరాలకు చేర్చారు.
బెంగళూరు:ఐపీఎల్ (IPL 2024) 17వ సీజన్లో బెంగళూరు (Bengaluru) బోణీ చేసింది. పంజాబ్ (Punjab)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (77: 49 బంతుల్లో) వీరవిహారం చేశాడు. చివర్లో దినేశ్ కార్తిక్ (28*; 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), మహిపాల్ లామ్రోర్ (17*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి నాలుగు బంతులు మిగిలుండగానే బెంగళూరును గెలిపించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, హర్ప్రీత్ బ్రార్ 2, హర్షల్ పటేల్, సామ్ కరన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
కింగ్ మెరుపులు.. చివర్లో ఉత్కంఠ
177 పరుగుల లక్ష్యఛేదనలో డుప్లెసిస్ (3), కామెరూన్ గ్రీన్ (3), మ్యాక్స్వెల్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా, విరాట్ కోహ్లీ మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. 31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుని, సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. హర్షల్ పటేల్ వేసిన 16 ఓవర్లో రెండు ఫోర్లు బాది అదే ఓవర్లో చివరి బంతికి అవుటయ్యాడు. సామ్ కరన్ వేసిన తర్వాతి ఓవర్లోనే అనుజ్ రావత్ (11) ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు అవసరం కాగా.. అర్ష్దీప్ వేసిన 18 ఓవర్లో మహిపాల్ లామ్రోర్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్లో దినేశ్ కార్తిక్ ఫోర్, సిక్స్ రాబట్టాడు. దీంతో సమీకరణం 6 బంతుల్లో 10గా మారగా.. సిక్స్, ఫోర్తో కార్తిక్ ముగింపు పలికాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (45: 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, ప్రభ్సిమ్రాన్ (25), జితేశ్ శర్మ (27), సామ్ కరన్ (23), శశాంక్ సింగ్ (21) విలువైన పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్ తలో రెండు వికెట్లు తీయగా.. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.