Talcum Powder | జాన్సన్స్‌ బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు.. బాధితురాలికి రూ.375 కోట్ల భారీ పరిహారం..!

Talcum Powder | అమెరికా దిగ్గజ కంపెనీలైన జాన్సన్ & జాన్సన్, కెన్వ్యూ ఇన్‌కార్పొరేటెడ్‌కు షికాగోలోని ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆ రెండు కంపెనీల బేబీ పౌడర్‌లు వాడటంవల్ల క్యాన్సర్ బారినపడి మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి ఏకంగా రూ.375 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చాలా కాలంపాటు సాగిన ఈ కేసు విచారణలో సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది.

Talcum Powder | జాన్సన్స్‌ బేబీ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు.. బాధితురాలికి రూ.375 కోట్ల భారీ పరిహారం..!

Talcum Powder : అమెరికా దిగ్గజ కంపెనీలైన జాన్సన్ & జాన్సన్, కెన్వ్యూ ఇన్‌కార్పొరేటెడ్‌కు షికాగోలోని ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆ రెండు కంపెనీల బేబీ పౌడర్‌లు వాడటంవల్ల క్యాన్సర్ బారినపడి మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి ఏకంగా రూ.375 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చాలా కాలంపాటు సాగిన ఈ కేసు విచారణలో సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది.

తెరీసా గార్షియా అనే మహిళ క్యాన్సర్ బారినపడి 2020లో మృతి చెందడానికి 70 శాతం బాధ్యత కెన్వ్యూదేనని షికాగో కోర్టులో వాదనలు విన్న జడ్జిలు తేల్చారు. అయితే మృతురాలి కుటుంబసభ్యులు మాత్రం జే & జే, కెన్వ్యూ పూర్వ సంస్థ కూడా క్యాన్సర్‌ను కలిగించే ఆస్బెస్టోస్ ఉన్న టాల్కం బేబీ పౌడర్లను విక్రయించాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి వారు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. ఆ మహిళ మరణానికి 30 శాతం బాధ్యత జే & జే అనుబంధ సంస్థ తీసుకోవాలని ఆదేశించింది.

వాదనల సందర్భంగా జాన్సన్ & జాన్సన్ తమ టాల్కం ఆధారిత ఉత్పత్తులు క్యాన్సర్ కలిగించవని చెప్పుకొచ్చింది. తాము బేబీ పౌడర్‌ను దాదాపు వందేళ్లుగా మార్కెటింగ్ చేశామని తెలిపింది. అంతేగాక తాము ఆర్థికంగా దివాలా తీశామని కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే జే & జే దివాలా వాదనను కోర్టు తోసిపుచ్చింది. కాగా కోర్టు తాజా తీర్పుపట్ల గార్షియా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. టాల్కం ఆధారిత పౌడర్ వల్ల క్యాన్సర్ సోకదన్న ఆ రెండు కంపెనీల మోసానికి కోర్టు తెరదించిందని వ్యాఖ్యానించింది.

అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై కెన్వ్యూ సంస్థ వెంటనే స్పందించలేదు. కానీ జే & జే సంస్థ స్పందిస్తూ ఈ తీర్పును తాము పై కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. గతంలో ఈ తరహాలో సవాల్‌ చేసిన 17 కేసులకుగాను 16 కేసులలో తాము విజయం సాధించామని గుర్తుచేసింది. తాము విక్రయించిన టాల్కం పౌడర్ సురక్షితమేనని కోర్టులు గతంలో తేల్చాయని పేర్కొంది. కాగా, ఈ బేబీ పౌడర్‌ను విక్రయిస్తున్న కెన్వ్యూ అధికారులు తాము టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపేశామని వెల్లడించారు.

కాగా, గతంలో జే & జే సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. 2020 కల్లా ఉత్తర అమెరికా మార్కెట్ల నుంచి టాల్కమ్‌ ఆధారిత బేబీ పౌడర్లను ఉపసంహరిస్తామని, 2023 డిసెంబర్ కల్లా ప్రపంచ మార్కెట్లన్నింటిలో టాల్కమ్‌ బదులు మొక్కజొన్న గంజి కలిపిన పౌడర్లను విక్రయిస్తామని పేర్కొంది.