Chiranjeevi Received Padma Vibhushan | పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి తన మానవతా సేవల ద్వారా, ప్రముఖ నటుడిగా సమాజానికి , ప్రజలకు ఎంతో సేవ చేసారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన చిరంజీవి గారు ఎన్నో సామాజిక అవసరాల కోసం విస్తృతంగా పనిచేసినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. కళారంగానికి అయన చేసిన సేవలు మరువరానివని రాష్ట్రపతి ప్రశంసించారు.

  • By: Tech    cinema    May 10, 2024 12:29 AM IST
Chiranjeevi Received Padma Vibhushan | పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్​ చిరంజీవి నేడు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్​ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ రెండో అత్యున్నత  పౌర పురస్కారమైన పద్మవిభూషణ్​కు ముందు చిరంజీవిని పద్మభూషణ్​, పద్మశ్రీలు కూడా వరించాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం అయనకు పద్మవిభూషణ్​ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పద్మ అవార్డుల ప్రదానం రెండు విడతలుగా జరిగింది. మొదటి విడతలో ఏప్రిల్​ 22న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్ అందుకోగా, నేడు చిరంజీవి, ప్రముఖ నటి, నాట్యకళాకారిణి వైజయంతీమాల బాలికి పురస్కారం ప్రదానం జరిగింది. వీరితో పాటు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎం. ఫాతిమా బీవీ, ముంబై సమాచార్​ పత్రిక ఎండీ హార్ముస్​జీ ఎన్​.కామా పద్మభూషణ్​ అవార్డులను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసభ్యులు, భార్య సురేఖ, కొడుకు, ప్రముఖ నటుడు రామ్​చరణ్​, కోడలు ఉపాసన, కూతురు సుస్మిత  హాజరయ్యారు.

ఈ సంవత్సరం మొత్తం 132 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 5 పద్మవిభూషణ్​, 17 పద్మవిభూషణ్​, 110 పద్మశ్రీలు ఉన్నాయి.  ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా, విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్​ తదితరులు పాల్గొన్నారు.

పద్మవిభూషణ్​ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో మెగాస్టార్​కు దేశం నలుమూలల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అవార్డు గ్రహీతలకు హోంమంత్రి విందు

కాగా, నేటి సాయంత్రం పద్మవిభూషణ్​ పురస్కార గ్రహీతలకు హోంమంత్రి అమిత్​ షా తన నివాసంలో ఘనంగా విందు ఏర్పాటు చేసారు. దీనికి మెగాస్టార్​ చిరంజీవి, ఆయన కుటుంబసభ్యులతో హాజరయ్యారు. మిగతా అవార్డు గ్రహీతలతో, ముఖ్య అతిథులతో ముచ్చటిస్తూ, చిరంజీవి చాలా ఉద్వేగంగా కనిపించారు.