బుల్లితెర ప్రేక్షకులని జబర్ధస్త్ షో ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఎంతో మంది కామెడీ పంచడమే కాక అందులో నటించిన వారికి మంచి జీవితం చూపించింది. ఈ షో తర్వాత చాలా మంది సెలబ్రిటీలుగా మారారు.ఈ షో ఇంత సక్సెస్ కావడం వెనక మనం చెప్పుకోవల్సింది రోజా, నాగబాబులతో పాటు అనసూయ, రష్మీల గురించి కూడా. అనసూయ 2022లో జబర్ధస్త్ నుండి తప్పుకోగా కొన్ని రోజుల పాటు రష్మీనే జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్ షోలని నడిపించింది. ఇక కొద్ది రోజులకి కన్నడ అమ్మాయి సౌమ్యరావుని తీసుకొచ్చారు. ఈమెకి తెలుగు అంత పర్ఫెక్ట్గా రాకపోయిన బానే మేనేజ్ చేసింది.
దాదాపు ఏడాదికి పైగా సౌమ్యరావు జబర్దస్త్ షో చేసినప్పటికీ ఆమెకి అంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. అయితే సడెన్గా ఆమె కొద్ది రోజుల క్రితం షో నుండి తప్పుకోవడం, ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ రావడం మనం చూశాం. అయితే సౌమ్యరావు సడెన్గా జబర్ధస్త్ మానేయడం వెనక ఏమై ఉంటుందా అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సౌమ్యరావు క్లారిటీ ఇచ్చింది. తన యాంకరింగ్ కొందరికి నచ్చిన మరి కొందరికి నచ్చలేదు. నేను కన్నడ అమ్మాయిని, అంత తెలుగు రాదు. అయితే యాంకరింగ్లో కూడా పెద్దగా అనుభవం లేదు. స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థం అయ్యేవి కాదు. నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు విమర్శించారు. డ్యాన్స్ రాదని విమర్శించడంతో డ్యాన్స్ క్లాసులకి కూడా వెళ్లాను.
అయితే నేను అసలే సన్నగా ఉంటాను. డ్యాన్స్ ప్రాక్టీస్ వలన ఇంకా సన్నగా అయిపోతున్నా. అందుకే జబర్దస్త్ డైరెక్టర్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయకండి. ఇంకా సన్నగా అయితే బాగుండరు. కొంచెం బాగా తిని ఒళ్లు పెంచండి, డ్యాన్స్ ఏదో మాదిరిగా మేనేజ్ చేసేయండి. పెద్దగా కష్టపడకండి అని చెప్పినట్టు పేర్కొంది సౌమ్యరావు. పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను అంటూ సౌమ్య చెప్పుకొచ్చింది. అయితే తనలోని లోపాల వలనే జబర్ధస్త్ని వీడాల్సి వచ్చిందని సౌమ్యరావు పరోక్షంగా చెప్పింది.తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవడంతో పాటు డ్యాన్స్ చేయకపోవడమే సౌమ్యరావుకి శాపంగా మారిందని కొందరు అంటున్నారు.