Ganesh Idols Pandal | గణేష్ మండపాలకు అనుమతి పొందడం ఎలా..? దరఖాస్తు విధానం ఇదే..!
Ganesh Idols Pandal | వినాయక చవితి( Vinayaka Chavithi ) ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇక హైదరాబాద్( Hyderabad ) నగరంలో గల్లీ గల్లీకో గణేశుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తుంటారు. వినాయకుడి విగ్రహాన్ని పెట్టేందుకు మండపాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఈసారి పోలీసుల అనుమతి కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) వెసులుబాటు కల్పించారు. మరి గణేష్ మండపాలకు అనుమతి పొందడం ఎలా..? దరఖాస్తు విధానం ఏంటో తెలుసుకుందాం.

Ganesh Idols Pandal | ఈ ఏడాది వినాయక చవితి( Vinayaka Chavithi ) సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఆ రోజు నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం గణేష్ విగ్రహాల( Ganesh Idols )ను హుస్సేన్ సాగర్( Hussain Sagar ) తో పాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం( Immersion ) చేయనున్నారు. 11 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు( Police ) తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గల్లీ గల్లీకో గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేసి.. తమ భక్తిని చాటుకుంటారు. ఈ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం..
గణేష్ మండపాలకు దరఖాస్తు విధానం ఇలా..
1. మొదటగా policeportal.tspolice.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మండపాల ఏర్పాటుకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి.
2. అనంతరం దరఖాస్తుదారుడి వివరాలు నమోదు చేయాలి. పేరు, మొబైల్ నంబర్, దరఖాస్తుదారుడి పూర్తి చిరునామా, అసోసియేషన్ నేమ్ వంటి వివరాలు నమోదు చేయాలి.
3. ఆ తర్వాత మండపం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు..? మండపం ఎంత ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు..? వినాయకుడి విగ్రహం ఎత్తు ఎంత..? ఎన్ని రోజుల పాటు విగ్రహాన్ని ఉంచుతారు..? వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
4. మీరు ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపం ఏ కమిషనరేట్(హైదరాబాద్/సైబరాబాద్/రాచకొండ) పరిధిలో, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా నమోదు చేయాలి.
5. చివరగా నిమజ్జనం ఏ రోజున, ఏ సమయంలో.. ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఆ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. రిఫరెన్స్ నంబర్ ద్వారా దరఖాస్తు రశీదు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గణేష్ మండపం ఏర్పాటుకు దరఖాస్తు విధానం.
నిబంధనలివే..
1. వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదు.
2. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల యజమానుల నుంచి ఎన్వోసీ తీసుకోవాలి.
3. మండపాలకు అవసరమైన విద్యుత్తు ఏర్పాటుకు.. ఆ శాఖ నుంచి అనుమతి పొందాలి.
4. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లపై నిషేధం ఉంటుంది.
5. సెల్లార్లు, కాంప్లెక్స్ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల అనుమతి కచ్చితంగా ఉండాలి.
6. మండపాల వద్ద వాలంటీర్లు కార్డులు/బ్యాడ్జీలు ధరించాల్సి ఉంటుంది.
7. విగ్రహాలు ఊరేగింపుగా వెళ్లే మార్గం, సమయం వివరాలను ముందుగానే పోలీసులకు ఇవ్వాలి.
8. మండపాల వద్ద ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు ఉంచుకోవాలి.
గణేష్ మండపాల ఏర్పాటు అనుమతి కోసం ఈ లింక్ను https://policeportal.tspolice.gov.in/index.htm క్లిక్ చేయండి..