శ్రీరాముడి భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు, భక్తుడు హనుమంతుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ శ్రీరాముడికి అక్క ఉందనే విషయం తెలుసా..? దశరథ మహారాజు - కౌసల్యకు శ్రీరాముడి జన్మించే కంటే ముందు ఒక కుమార్తె జన్మించింది.
దాశరథి అయిన శ్రీరామచంద్రమూర్తికి ఒక సోదరి ఉందని రామాయణం చెబుతోంది. తన పేరు శాంత. అద్భుత సౌందర్యరాశి, సకలగుణసంపన్నురాలు, అన్ని విద్యలలోనూ ఆరితేరిన వీర రాజకుమారి.
కోసల దేశాన్ని పరిపాలించే దశరథునికి రాములవారు జన్మించకముందే, ‘శాంత’ అనే కుమార్తె జన్మించింది. కానీ, ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుడనే రాజుకు దత్తతగా ఇచ్చాడు, దశరథుడు. రోమపాదుడు దశరథుని స్నేహితుడు. పైగా, రోమపాదుని భార్య, కౌసల్య సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకు, తన కూతురిని దత్తత ఇచ్చారు వారు. శాంత అంగరాజ్యంలో, అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్త్ర విద్యలలోనూ, వేద వేదాంగాలలోనూ, అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి ధీటైన అందం, ఆమె సొంతం. ఒక రోజు శాంత, రోమపాదునితో కలిసి ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా, ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తను వ్యవసాయం చేయదల్చుకున్నాననీ, ఆ వ్యవసాయానికి ఏదైనా సహాయం అందించమనీ, ఆ బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకున్నాడు. కానీ, కూతురితో కలసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు, ఆ బ్రాహ్మణుని అభ్యర్థనను ఆలకించ లేదు. తన భక్తునికి జరిగిన అవమానాన్ని, దేవలోకాధిపతి ఇంద్రుడు సహించ లేక పోయాడు. అంగ రాజ్యం కరవుకాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు.
ఏళ్లు గడుస్తున్నా, తగిన వర్షాలు కురవకపోవడంతో, ఏం చేయాలో అంగ వాసులకు పాలుపోలేదు. రోమపాదుడికి, ఋష్యశృంగుడిని రాజ్యం లోకి రప్పిస్తే, రాజ్యంలో వర్షాలు పడతాయని సలహా ఇచ్చారు, రాజగురువులు. కానీ, అది అంత సులువైన విషయం కాదు. ఋష్యశృంగుడు విషయలోలత్వం తెలియనివాడు. అతన్ని తండ్రి విభాండకుడు, ఆశ్రమం నుండి బయటికి పంపేందుకు ఇష్టపడడు. కాబట్టి, అది అసాధ్యమైన విషయం. దానికి తరుణోపాయం ఆలోచించి, ఆ రుష్యశృంగుని ఆకర్షించి, అంగరాజ్యానికి తీసుకువచ్చేందుకు స్వయంగా రాకుమారి శాంత బయల్దేరుతుంది. అపురూప సౌందర్యరాశి అయిన శాంతని చూడగానే రుష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు ఋష్యశృంగుడు అంగదేశంలో ఆడుగు పెట్టగానే, వానలు కురిశాయి. ప్రాణికోటి సేదతీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి, తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్ళి చేశాడు. అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ, విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డాడు రాజు. అందుకని, మునిని శాంతపరచటం కోసం, రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కర్రి ఆవులనూ, ఎద్దులనూ నిలిపి, పరిజనాన్ని కాపు ఉంచాడు.”
ఈ ఆవులూ, ఎడ్లూ, మేకలూ, భూములూ, మీ కుమారుడివి. మేము మీ సేవకులము” అని వినయంగా మాట్లాడమని, భటులను హెచ్చరించాడు. అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ, మహాముని రానే వచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం, పరిచారకులు మునీంద్రునికి స్వాగతం పలికి, చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకూ చల్లార్చి, ఆయనను పట్టణంలో ప్రవేశ పెట్టారు. రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూన్న కొడుకునూ, పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడలినీ చూసిన విభాండక మునికి, ఆనందం కలిగింది. “నాయనా ఋష్యశృంగా! ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి. ఒక కుమారుడు కలిగిన తరువాత, మీరు అరణ్యాలకు రావచ్చు” అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై, ఆ వెనుక వానప్రస్థాన్ని స్వీకరించాడు.
ఒకరకంగా రాములవారు అవతారం దాల్చేందుకు కూడా, శాంతే కారణం. ఎందుకంటే, అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న సమయంలోనే, రుష్యశృంగుడు దశరథుని చేత పుత్రకామేష్టియాగాన్ని చేయించాడు. ఆ యాగ ఫలంగానే, రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు జన్మించారు. ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని, రామాయణం లోని బాల కాండంలో, దశరథుని మంత్రి అయిన సుమంతుడు వివరించాడు.
అయితే శాంత కల్పిత గాథ అనేవారూ ఉన్నారు. శాంత గాథ పూర్తిగా కల్పితం కాదనేందుకు కొన్ని సాక్ష్యాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఉత్తరాదిన ‘రిషివంశి’ అనే క్షత్రియవంశంవారు తాము రుష్యశృంగ, శాంతల వారసులం అని ఇప్పటికీ నమ్ముతారు. రుష్యశృంగ దంపతుల పేరిట నేపాల్లోని మహాలక్ష్మి అనే పట్నంలో ఒక గుడి కూడా ఉంది. దేవదత్త పట్నాయక్ వంటి ఆధ్మాత్మిక రచయితలు శాంతను మర్చిపోలేని, మరువగూడని పాత్రగా పేర్కొంటున్నారు.