Site icon vidhaatha

Tirumala | రేపటి నుంచి తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు.. ఉత్సవాలకు నేడు అంకురార్పణ

Tirumala | తిరుమల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి 12 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకుర్పాణం జరుగనున్నది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం, బీజవాపనం కీలకం. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

అనంత‌రం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్రత్యేక పూజ‌లు నిర్వహించి పుట్టమన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి.ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అన్నది నమ్మకం. అంకురార్పణ ఘట్టం తర్వా రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.

పద్మావతి ఆలయంలో..

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 3 నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయదశమినాడు రాత్రి 7:45 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. న‌వ‌రాత్రి ఉత్సవాల నేపథ్యంలో పదిరోజుల పాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేసింది. 4, 11 తేదీల్లో లక్ష్మీపూజ, 12న ఊంజల సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్నది.

Exit mobile version