Site icon vidhaatha

Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. 19న ఆర్జిత సేవా టికెట్ల జనవరి కోటా విడుదల

Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం లాటరీ ఉంటుందని.. టికెట్ల పొందిన వారంతా 23న మధ్యాహ్నం 12గంటల వరకు డబ్బులు చెల్లిస్తే లక్కీడీప్‌లో టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది. ఇక 22న ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు చెప్పింది.

అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్స్‌కు సంబంధించిన కోటా విడుదలవనున్నది. ఇక అంగప్రదక్షిణం టోకెన్లను 23న ఉదయం 10గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమ, తిరుపతిలో వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Exit mobile version