Anil Ravipudi | టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడి పేరు గుర్తుకు వస్తుంది. ఆయన తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని హాస్యం, భావోద్వేగాలు, పండుగ వాతావరణాన్ని మేళవిస్తూ సినిమాలు తెరకెక్కిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్గా నిలవడంతో అనిల్ క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి లాంటి లెజెండరీ స్టార్తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.
ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చిరంజీవి లుక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ను ట్రై చేద్దామనే ఆలోచనతో తన వద్దకు వచ్చారని తెలిపారు. అయితే ఆ లుక్కు తాను స్పష్టంగా “నో” చెప్పినట్లు అనిల్ వెల్లడించారు. చిరంజీవిగారు బయట ఎలా ఉంటారో, సినిమాల్లోనూ అలానే చూపించాలనేది నా ఆలోచన. ప్రేక్షకులు ఆయన్ని సహజంగా చూడాలని కోరుకుంటారు. అందుకే ప్రత్యేకమైన కొత్త లుక్ అవసరం లేదని చెప్పాను అని ఆయన వివరించారు. దర్శకుడిగా తనకు ఇచ్చిన స్వేచ్ఛను చిరంజీవి పాజిటివ్గా తీసుకున్నారని కూడా అనిల్ పేర్కొన్నారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోందని చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణ. చిరు – నయన్ కాంబినేషన్పై మంచి బజ్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల, శశిరేఖ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో దాదాపు 20 నిమిషాల పాటు సీన్స్ ఉంటాయని, ఇవి సినిమాకు పెద్ద ప్లస్గా నిలుస్తాయని అంటున్నారు. రెండు స్టార్ల కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు పండుగ విందులా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి.
అన్ని పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయని, 2026 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకుంటారన్న విమర్శలకు అనిల్ మాటలే నిదర్శనమని కొందరు ట్రోల్ చేస్తున్నారు. గతంలో ‘ఆచార్య’ సమయంలో కొరటాల శివ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు.
