Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై వస్తున్న వార్తలకు ఆయన నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది. గతేడాది ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్, ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు, ఒక నిర్మాతకు కొత్త సినిమా చేస్తానని మాట ఇచ్చారనే రూమర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దేవా కట్టాతో సినిమా చేయడానికి అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొత్త సినిమాలకి కమిట్ కాలేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. ఆయన తదుపరి ప్రాజెక్టులపై జరుగుతున్న ఊహాగానాల్లో నిజం లేదు. ఇప్పటికైతే కొత్త చిత్రాలను ప్రారంభించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవు. ఏవైనా కొత్త సినిమాలు ఉంటే అధికారికంగా మా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తాం అని సంస్థ స్పష్టం చేసింది. దీంతో రూమర్లకు ఫుల్స్టాప్ పడింది.
ఇక ‘ఓజీ’ సినిమాకు సీక్వెల్గా ‘ఓజీ 2’ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితంపై మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో అభిమానులు త్వరలోనే ‘ఓజీ 2’ను ప్రారంభించాలని కోరుకుంటున్నారు. దీనిపై కూడా సరైన సమయంలో అధికారిక ప్రకటన ఇస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంది.
సురేందర్ రెడ్డి మూవీ సంగతేంటి..
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ ప్రకటనతో స్పష్టమైంది. కాగా, గతంలో ప్రకటించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్పై మాత్రం ఈ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఏది ఏమైన, పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లన్నింటినీ ఆయన టీమ్ ఖండించడంతో అభిమానులకు స్పష్టత లభించింది. ఇకపై అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడాల్సిందే.
