Mohan Babu | తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధిక ఫీజులతో విద్యార్థులపై దోపిడీ జరుగుతోందని ప్రశ్నించిన విద్యార్థి నేతలపై దాడి, కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ యాజమాన్య తీరును నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ నాయకుడు వినోద్లను అడ్డుకుని బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుపోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు మోహన్ బాబు, మంచు విష్ణు పీఆర్వో సతీష్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
సుమారు 30 మంది మద్దతుదారులు పలు వాహనాల్లో వచ్చి నడిరోడ్డుపై హంగామా సృష్టించి విద్యార్థి నేతలను తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందరపు మురళి తీవ్రంగా ఖండించారు. వెంటనే ఏఎస్పీ రవి మనోహర్, ఎస్పీ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులకు చెందిన వాహనాలను స్వాధీనం చేసుకుని బాధితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విద్యార్థులకు ఏదైనా అపాయం కలిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజా సంఘాలు హెచ్చరించాయి.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కఠినంగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విద్యాసంస్థలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించినందుకే విద్యార్థి నేతలపై దౌర్జన్యానికి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం తగదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇక మోహన్ బాబు విద్యాసంస్థలపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదని గుర్తు చేస్తున్నారు. గతంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రూ.15 లక్షల జరిమానా విధించడమే కాకుండా, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలపై మంచు విష్ణు స్పందిస్తూ తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య అందిస్తోందని, తల్లిదండ్రులు తమకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ తాజా కిడ్నాప్ ఆరోపణల ఘటనతో యూనివర్సిటీ యాజమాన్యం మరోసారి వివాదాల కేంద్రంగా మారింది.
