Dragon OTT Deal Explained: Why Netflix Put a ₹500 Cr Condition on NTR’s Pan-India Film
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ను నెట్ఫ్లిక్స్ సుమారు ₹125 కోట్లకు డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ ఒప్పందం బాక్సాఫీస్ పనితీరుతో అనుసంధానమై ఉంది. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా విడుదల చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.
- ‘డ్రాగన్’ OTT రైట్స్ భారీ రేటుకు అమ్మకం..
- బాక్సాఫీస్ లక్ష్యం 500 కోట్లు.. అప్పుడు మాత్రమే పూర్తి చెల్లింపు!
- చిత్రం రెండు భాగాలుగా రాబోతోందా?
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
Conditioned OTT Deal NTRNEEL | పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, బ్లాక్బస్టర్ దర్శకుడు ప్రశాంత్నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. షూటింగ్ జోర్డాన్లో జరుగుతుండగానే ఈ చిత్రం తన ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి క్లోజ్ చేయడం సినీ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాన్ ఇండియా మార్కెట్, భారీ స్కేల్, నీల్ స్టైల్ మాస్ మేకింగ్ . అన్నీ కలిసి, ఈ ప్రాజెక్ట్పై అంచనాలను అమాంతం పెంచేసాయి.
రూ.125 కోట్లకు నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులు
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను సుమారు 125 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ సమాచారం. టాలీవుడ్లో ఇది అత్యంత భారీ ఓటీటీ డీల్స్లో ఒకటిగా నిలవబోతోంది.
అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే, ఎన్టీఆర్ గత చిత్రం దేవర కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమ్ అయి గణనీయమైన వీక్షణలు సాధించింది. ఆ ఫలితమే ‘డ్రాగన్’పై ప్లాట్ఫామ్ నమ్మకాన్ని మరింత బలపరిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. డీల్ అన్ని భాషలకు వర్తించేలా పూర్తి చేసినట్లు సమాచారం.
నెట్ఫ్లిక్స్ సరికొత్త కొత్త షరతు – ఇదో ట్రెండ్ కానుందా?
ఇటీవలి కాలంలో ఓటీటీ సంస్థలు నిర్థారిత మొత్తం చెల్లించే విధానాన్ని తగ్గించి, బాక్సాఫీస్ పనితీరుతో అనుసంధానించిన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంతకుముందు థియేటర్లలో ఫెయిల్ అయిన సినిమాల వల్ల ఓటీటీ సంస్థలు నష్టపోయిన నేపథ్యంలో ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి.
‘డ్రాగన్’ విషయంలో కూడా ₹125 కోట్ల పూర్తిగా చెల్లించాలంటే, చిత్రం ప్రపంచవ్యాప్తంగా కనీసం 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాలనే షరతును నెట్ఫ్లిక్స్ విధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మార్క్ చేరుకోకపోతే తుది చెల్లింపులో కోత విధించే అవకాశం ఉంది. అదే సమయంలో అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తే అదనపు బోనస్ చెల్లించే వెసులుబాటు కూడా ఉండొచ్చని సమాచారం. ఈ విధానం నిర్మాతలు–ఓటీటీ సంస్థల మధ్య రిస్క్ను సమతుల్యం చేస్తోంది.
రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందా?
ఇదిలా ఉండగా, ఫిల్మ్నగర్లో మరో ఆసక్తికర ప్రచారం ఏమిటంటే, ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. భారీ కథా విస్తృతి, ప్రపంచ స్థాయి యాక్షన్ సెటప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. షూటింగ్, ఎడిటింగ్ పూర్తయ్యాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణీవసంత్ నటిస్తుండగా, కీలక పాత్రలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా మోస్తున్నాయి.
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా, కంటెంట్ బలంగా ఉంటే 500 కోట్ల మార్క్ దాటడం అసాధ్యమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
