China Manja | నిషేధం ఉన్నా హైదరాబాద్​లో ఆగని చైనా మాంజా అమ్మకాలు

రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చైనా మాంజాను బహిరంగంగా అమ్ముతున్నారు. సోషల్ మీడియా రీల్స్‌తో ప్రచారం చేస్తూ అక్రమంగా విక్రయాలు సాగుతున్నాయని Animal Warriors Conservation Society ఆరోపించింది.

China Manja | నిషేధం ఉన్నా హైదరాబాద్​లో ఆగని చైనా మాంజా అమ్మకాలు

Banned Chinese Manja Sold Openly in Hyderabad Despite Ban

విధాత సిటీ బ్యూరో | హైదరాబాద్​: 

China Manja | రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ, ప్రమాదకరమైన చైనా మాంజా అమ్మకాలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని Animal Warriors Conservation Society ఆరోపించింది. పతంగి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, అటవీ శాఖ తదితర విభాగాలు చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ నిషేధిత మాంజా మార్కెట్‌లో అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోందని సంస్థ తెలిపింది.

Man suffers severe throat injury after coming in contact with banned Chinese manja during kite flying

యానిమల్​ వారియర్స్​ కన్​సర్వేషన్​ సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ నాయర్ మాటల ప్రకారం, హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ ప్రాంతంలోని బాలారాం గల్లీలో ఒక పతంగుల విక్రేత బహిరంగంగానే చైనా మాంజాను విక్రయిస్తున్నాడు. కస్టమర్ల ముందు వివిధ వస్తువులను చైనా మాంజాతో కోసి చూపిస్తూ, ఈ మాంజా ఎంత పదునైనదో ప్రదర్శస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈ డెమో వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుండగా, ఒక వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే సుమారు 42 లక్షల వ్యూస్ వచ్చాయని తెలిపారు.

సోషల్ మీడియా రీల్స్‌ ద్వారా ప్రచారంఆధారాలు ఉన్నా చర్యలేవి?

 

View this post on Instagram

 

A post shared by Lalith Singh (@srimaya_kala_kendra)

‘స్కై వారియర్’ పేరుతో విక్రయిస్తున్న ఈ మాంజా “దేన్నైనా కోసేస్తుంది” అంటూ ప్రచారం చేస్తున్నారని నాయర్ అన్నారు. ఇది ఒక్క దుకాణానికి పరిమితం కాదని, ధూల్‌పేట్ ప్రాంతంలో అనేక షాపులు ఇదే విధంగా చైనా మాంజాను అమ్ముతున్నాయని తెలిపారు. ఈ వీడియోలే నిషేధిత వస్తువు అమ్మకానికి స్పష్టమైన ఆధారాలని, వాటి ఆధారంగా అరెస్టులు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, ఆన్‌లైన్ బుకింగ్స్ తీసుకుని ఇతర రాష్ట్రాలకు కూడా ఈ మాంజాను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి రాకుండా సాగుతుండటం మరింత ప్రమాదకరమని సంస్థ పేర్కొంది.

పక్షుల రక్షణకు కఠిన చర్యలు అవసరం

Rescue workers treat birds critically injured by sharp Chinese manja strings in Hyderabad

చైనా మాంజా వల్ల పక్షులు, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉందని గుర్తుచేస్తూ, ఈ అక్రమ వ్యాపారంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని Animal Warriors Conservation Society డిమాండ్ చేసింది. తయారీదారులు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు మాత్రమే కాకుండా, ఈ మాంజా విక్రయానికి వేదికలు కల్పిస్తున్న సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరింది.