- వేగంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్
- ఎకరం రూ.177 కోట్లు పలికింది
- హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడ్డాం
- భవిష్యత్లో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే
- నారెడ్కో 15వ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, అక్టోబర్10 (విధాత) : రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ మహానగరంలో వేగంగా దూసుకెళ్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందువల్లనే వేలం పాటలో ఎకరం భూమి రూ.177 కోట్లు పలికిందన్నారు. శుక్రవారం హైటెక్స్ లో నిర్వహించిన నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షోను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలోని ఏ రాష్ట్రంలో కనబడదు, స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తే ఆ రోజు పండుగ జరుపుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలదని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దట్టమైన అడవులు, జలపాతాలు, టైగర్ ఫారెస్ట్ లు ఉన్నాయన్నారు. హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు వివిధ వర్గాలను ఆ ప్రాంతాలకు విరివిగా తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక వ్యయం లో భాగంగా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. రెండు సంవత్సరాల్లో 20వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడు ఇప్పుడే కనిపిస్తున్నాయన్నారు. ఈ పనులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయన్నారు. ప్రభుత్వ వేలంలో ఎకరం రూ.177 కోట్లు పలికిందంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా దూసుకువెళ్తుందో అర్థమవుతుంది అన్నారు. ఈ వేలంలో పాల్గొన్న 25 మంది బిల్డర్లు ఎకరాకు రూ.150 కోట్ల వరకు కోట్ చేశారని డిప్యూటీ సీఎం వివరించారు.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవేను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు 1,487 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్ మంత్రిని ఒప్పించి రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు అనుమతి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరం లోని సరస్సులు, అందమైన రాతిగుట్టలు, పార్కులను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరముందన్నారు.
ప్రజా ప్రభుత్వం బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని తెలిపారు. బిల్డ్ నౌ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటుచేసి నిర్మాణ అనుమతులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా పసుపు ఏర్పాట్లు చేసిందని చెప్పారు.
భవిష్యత్లో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే
భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని భట్టి తెలిపారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చాం అని అన్నారు. విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు అని తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉచితంగా విద్యను అందించేందుకు ఒక్కో పాఠశాలకు రూ.25కోట్లతో 25ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సీఎఎస్ఆర్ నిధులను విద్య, వైద్యరంగంపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నారెడ్కో ప్రతినిధులకు భట్టి సూచించారు. విల్లాలు, హై రైజ్ బిల్డింగులకే పరిమితం కావొద్దు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయాలని కోరారు. రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టికర్తలుగా గౌరవిస్తుందన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాదులో జరుగుతున్న అభివృద్ధిని ప్రాపర్టీ షో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్న నారెడ్కో బృందానికి భట్టి అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో రియల్ ఎస్టేట్ ది కీలక పాత్త : మంత్రి జూపల్లి
రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశంలోనే అత్యధిక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమన విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నారెడ్కో ప్రెసిడెంట్ విజయ్ సాయి మేక, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, కిరణ్, నారేడ్కో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పీఎస్ రెడ్డి, ఎం.వెంకయ్య చౌదరి, పీ.రవిరెడ్డి, స్వామీనాథన్, కాళీప్రసాద్, వెంకటేశ్, హరిబాబు, దశరథ్ రెడ్డి, కిరణ్ ఇతర బిల్డర్లు, ప్రమోటర్లు తదితరులు పాల్గొన్నారు.