హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్లో ఏటికేడు ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండటం పట్ల ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్లో రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం, ప్రైవేట్ కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంపై వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ల లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని సీఎం తెలిపారు.
ఆదాయ వనరులు పెంచుకోవాలి
స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతులు మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ వికాస్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హెచ్యూఎంటీఏ ఎండీ జీవన్ బాబు, దక్షిణ మధ్య రైల్వే డీసీఎం చరణ్ నాయక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు: సీఎం రేవంత్ రెడ్డి
IRCTC Tamilnadu Tour | వీకెండ్లో తమిళనాడు ట్రిప్.. రూ.15వేలలోనే ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ
