విధాత, హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్ చోరీ వ్యవహారం కలకలం రేపింది. డాక్టర్ ను అంటూ వచ్చి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారంతో పరారైంది. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన సుధా రాణికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. డిశ్చార్జ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ మహిళ డాక్టర్ కోట్ ధరించి ట్రీట్మెంట్ ఇస్తానంటూ పేషెంట్ గదిలోకి ప్రవేశించింది. ఆసుపత్రి గదిలో ఉన్న పేషంట్ బంధువులను నకిలీ డాక్టర్ బయటకు పంపించింది. పేషెంట్ గా ఉన్న మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపటికే ఆమె స్పృహ తప్పిన స్థితిలోకి వెళ్లింది. ఇదే అదనుగా ఆమె వద్ద ఉన్న 10తులాల బంగారు నగలను కాజేసి ఉడాయించింది. బంగారం కనిపించకపోవడంతో బంధువుల ఆందోళన చెందారు. జరిగిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశించారు. ఆ డాక్టర్ ఎవరో తెలియదు అంటూ ఆసుపత్రి యాజమాన్యం చెప్పిన సమాధానంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.
నర్సింగ్ స్టాఫ్ రూమ్ వద్ద సీసీ ఫుటేజ్లో నకిలీ మహిళా డాక్టర్ కదలికలను గుర్తించారు.ఆమె తెలిసిన వ్యక్తేనా..? లేక బయట వ్యక్తినా..? అనే అనుమానాల మధ్య పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఒకే తరహా పథకాలు..ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల పురోగమనం
GHMC Property Tax : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !
