KCR : కాంగ్రెస్ రౌడీషీటర్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నిలబెట్టిన 'రౌడీషీటర్ ఫ్యామిలీ' అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని, బీఆర్ఎస్ పాలన, సంక్షేమ పథకాలను వివరించాలని ఆయన సూచించారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి జూబ్లీహిల్స్ ఓటర్లకు ఇంటింటికీ తిరిగి వివరించాలకి సూచించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేసీఆర్ పార్టీ శ్రేణులకు మార్గదర్శకం చేశారు. సమావేశంలో పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలని సూచించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ బాకీ కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలని..ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయాలని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని కేసీఆర్ సూచించారు.
ఈ సమావేశంలో పోటీలో ఉన్న అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ సహా, ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇంచార్జులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.