ఎలక్ట్రిక్ వాహనాల రాయితీలో మారుతి కంపెనీ కూడా: మంత్రి పొన్నం

తెలంగాణలో ఈవీ వాహనాలకు ప్రోత్సాహం పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీల్లో మారుతి సుజుకీ కూడా చేరిందని మంత్రి పొన్నం తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాల రాయితీలో మారుతి కంపెనీ కూడా: మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకానికి మారుతి సుజుకీ కార్ల కంపెనీ కూడా ముందుకొచ్చినట్లుగా రాష్ట్ర రోడ్డ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదర్శ మారుతి సుజుకి నెక్స నుండి e VITARA ఎలక్ట్రిక్ కార్లను మంత్రి పొన్నం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం రాయితీ ఇచ్చేందుకు మహేంద్ర ఎలక్ట్రిక్స్, ఆథర్‌ ఎనర్జీ, గ్రావిటన్‌ మోటార్స్‌, ఓలాతో పాటు పలు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు 100% రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమలులో ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ నగరం ఢిల్లీ తరహాలో కాలుష్య కోరల్లో చిక్కుకోకూడదనే ఈవీలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు. రెడ్కో ద్వారా ఈవీ ఛార్జింగ్‌ స్టషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఈవీ వాహనాలకు లోన్‌ తీసుకునేలా చేయాలని ఆర్థికశాఖ మంత్రిని కోరడం జరిగిందని వెల్లడించారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కుకు పంపిస్తున్నామని, రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. ‘వాహన్‌’ పోర్టల్‌లో తెలంగాణ చేరిందని, వాహనం కొనుగోలు చేసినప్పుడు షోరూమ్‌ లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు.

ఈవీ పాలసీ రాకముందు రాష్ట్రంలో కేవలం 74 వేల ఎలక్ట్రిక్​ వెహికల్స్ ఉండగా.. పాలసీ అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలోనే కొత్తగా లక్షకుపైగా ఈవీలు అమ్ముడుపోవడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీ ప్రకటన, గల్ఫ్​యుద్ధం నేపథ్యంలో ఈ నెల నుంచి ఎలక్ట్రిక్​వెహికల్స్​కు మరింత డిమాండ్​పెరిగిందని, ఈ ఏడాది చివరికల్లా మరో 3లక్షల కొత్త ఈవీలు అమ్ముడుపోతాయని రవాణాశాఖ అంచనా వేస్తోంది. ఎలక్ట్రిక్​ వాహనాలకు లైఫ్ టాక్స్ కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 860 కోట్లకు పైగానే రాయితీ ఇచ్చింది. మరో రూ.1000 కోట్లయినా రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల మంత్రి పొన్నం ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలు ముందున్నాయని, వాటిని అధిగమించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కు 100 శాతం లైఫ్ ట్యాక్స్ మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చి నుంచి పాలసీ అమల్లోకి రాగా, ఏడాది తిరిగేసరికి అంటే 2026 మార్చి వరకు రాష్ట్రంలోని వివిధ షోరూంలలో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ సహా వివిధ రకాలకు చెందిన 1లక్షా 6 వేల ఎలక్ట్రిక్​ వాహనాలు అమ్ముడుపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి :

ప్రాంతీయ విద్వేష వేదికగా చంద్రబాబు అమరావతి : మాజీ మంత్రి ధర్మాన ఫైర్
సర్కారీ వారి నెంబర్ ఎప్పుడూ బిజీనే..జర్నలిస్టుల పరేషాన్ !