Revanth Reddy : తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం

తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

Revanth Reddy : తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ -2047 లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు కొనసాగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, మంచి సానుకూల వాతావరణం ఉందని..పెట్టుబడులకు సరైన వేదిక అని..2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించామని తెలిపారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉందని, దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తుందని, 2047 నాటికి భారతదేశం జీడీపీలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం అని..ఆ లక్ష్యాలను చేరుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్

తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ అని, మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు… కానీ ఆ విజన్ ను సాధించగలం అన్నారు. ఈ విషయంలో మా టీమ్ కు నేను చెప్పేదొక్కటేనని, కష్టంగా ఉంటే వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తామన్నారు. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నానని.. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక…ఇవాళ మీరందరూ మాతో చేరారు అని..ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం అని తెలిపారు. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నానన్నారు.

ప్రేరణ ఇచ్చిన ఆ దేశాలతోనే మా పోటీ

చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి స్ఫూర్తిదాయకమని, గ్వాంగ్‌డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్‌కైనా అతిపెద్దదని, 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం అన్నారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం అని, ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మూడు భాగాలుగా తెలంగా రైజింగ్ లో ముందడుగు

సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం… ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించామని, మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్ట మొదటి రాష్ట్రం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)లుగా మూడు భాగాలుగా తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు పురోగమిస్తామన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు.

ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047కు బీజం

దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారని, మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం అని, తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో, శ్రీమతి సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని గుర్తు చేశారు. భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. ఈ క్రమంలో దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరిన సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ప్రజలు..నిపుణుల సూచనలతోనే తెలంగాణ రైజింగ్

భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం అని, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకుని తెలంగాణ రైజింగ్ రూపొందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం అని, వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇవి కూడా చదవండి :

Hyderabad : హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
IndiGo Staff Dance Viral : ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్