తెలుగులో మాట్లాడి.. సంద‌డి చేసిన నెద‌ర్లాండ్స్ క్రికెట‌ర్! విజయవాడ అబ్బాయే

తెలుగులో మాట్లాడి.. సంద‌డి చేసిన నెద‌ర్లాండ్స్ క్రికెట‌ర్! విజయవాడ అబ్బాయే

ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ సీజ‌న్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. రేపు ఆస్ట్రేలియా-భార‌త్ మ‌ధ్య మ్యాచ్ జర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్ కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడ‌గా,ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఓ దశ వరకు మెరుగ్గానే కనిపించిన నెదర్లాండ్స్… ఉన్నట్టుండి వరుసగా వికెట్లు కోల్పోయి ప‌రాజ‌యం చెందింది.



అయితే నెదర్లాండ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుతేజం తేజ నిడమనూరు ఈ మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో వీరోచిత సెంచరీతో నెదర్లాండ్స్ కు బెర్తు ఖరారు చేసిన ఇత‌గాడు, విండీస్ ను తొలిసారి వరల్డ్ కప్ కు దూరం చేసి వార్త‌ల‌లోకి ఎక్కాడు.



అయితే పాక్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇత‌గాడిపై చాలా ఆశ‌లు పెట్టుకుంది నెద‌ర్లాండ్స్. అయితే తేజ 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. పాక్ ఎక్స్ ప్రెస్ బౌలర్ హరీస్ రవూఫ్ బౌలింగ్ లో ఫఖార్ జమాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 9 బంతులాడిన తేజ ఒక ఫోర్ కొట్టాడు. మ్యాచ్ ప్రారంభించడానికి ముందు నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ తేజ నిడమనూరు తెలుగులో మాట్లాడి అలరించాడు.



హైదరాబాద్.. ఆరెంజ్ అంటే మీకు చాలా ఇష్టం అంటూ ఆయన తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు. తాము పాక్‌తో ఉప్పల్‌లో మ్యాచ్ ఆడుతున్నామని అన్నాడు.. మైదానానికి వచ్చి తమకు సపోర్ట్ చేయాలని, తాము సంతోషిస్తామని పేర్కొన్నాడు.



కాగా, తేజ నిడమనూరు విజయవాడలో జన్మించినప్పటికీ నెదర్లాండ్స్ లో పెరిగాడు. సన్ రైజర్స్ జట్టు జెర్సీ కూడా ఆరెంజ్ కలర్ లో ఉండడంతో హైదరాబాద్ ప్రజలకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టమని, తమ జెర్సీ రంగు కూడా ఆరెంజ్ అని తేజ చెప్పే ప్రయత్నం చేశాడు. మెగాటోర్నీ తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల మధ్య జరగగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజ‌యం సాధించింది.ఈ రోజు శ్రీలంక‌-సాతాఫ్రికా మధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.