జైలుకు బండి భగీరథ్‌..కస్టడీకి పిటిషన్

పోక్సో కేసులో అరెస్టు అయిన బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. భగీరథ్‌ను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా భగీరథ్ కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించడం ఆసక్తికరం.

విధాత, హైదరాబాద్ : పోక్సో కేసులో అరెస్టు అయిన బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అంతకుముందు పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో పోలీసులు రెండు గంటలకుపైనే విచారించి భగీరథ్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా భగీరథ ను ప్రశ్నించారు.

వైద్య పరీక్షల అనంతరం అతడిని మేడ్చల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి భగీరథ్‌కు ఈనెల 29 వరకు రిమాండ్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భగీరథ్‌ను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు

కేసు దర్యాప్తులో భాగంగా భగీరథ్ కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించడం ఆసక్తికరం.

రోజంతా నాటకీయ పరిణామాలు…అరెస్టా?..లొంగుబాటా..?

బండి భగీరథ్ కేసులో శనివారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు హైడ్రామా నడిచింది. ముందస్తు బెయిలుకు, అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టులో భగీరథ్‌కు ఉపశమనం లభించని నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. శనివారం ఉదయం పోలీసులు భగీరథ్‌పై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. అతణ్ని పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ నివాసానికి సైతం వెళ్లి భగీరథ్ ఆచూకీ కోసం గాలించారు.

ఈ నేపథ్యంలో తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భగీరథ్‌ను అరెస్టు చేశామంటూ సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పోలీస్‌ అకాడమీ(అప్పా జంక్షన్‌) సమీపంలో అదుపులోకి తీసుకున్నామని, నేరుగా పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. భగీరథ్‌ను స్టేషన్‌ తీసుకెళ్లగానే కేసు పర్యవేక్షణాధికారిణి, డీసీపీ రితిరాజ్‌ అక్కడికి చేరుకుని రెండు గంటల విచారణ అనంతరం కోర్టుకు తరలించారు. రిమాండ్ అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.

Latest News