Bangladesh violence| బంగ్లాదేశ్ లో మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు

బంగ్లాదేశ్ లో మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడం..మైనార్టీలపై దాడులకు దిగడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది మరణంతో ఆందోళనకారులు మళ్లీ వీధుల్లోకి నిరసనలకు దిగారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Dec 19, 2025, 11:15 am IST
Read Time: 4 mins
Bangladesh violence| బంగ్లాదేశ్ లో మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలు(anti India protests) చెలరేగాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడం..మైనార్టీలపై దాడులకు దిగడంతో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది మరణంతో ఆందోళనకారులు మళ్లీ వీధుల్లోకి నిరసనలకు దిగారు. నేషనల్ సిటిజన్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. అయితే నిరసనలు హింసాత్మకంగా మారిపోగా..ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా కార్యాలయాలపై ఆందోళన కారులు నిప్పు పెట్టారు. రాజ్‌షాహీలోని అవామీలీగ్‌ పార్టీ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు.

ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్‌ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. చిట్టగాంగ్‌ మాజీ మేయర్‌ మొహియుద్దీన్‌ నివాసానికి నిప్పు పెట్టారు. అల్లర్లలో 25మంది జర్నలిస్టులను అతి కష్టం మీద రక్షించారు. మైమెన్ సింగ్ జిల్లా భలూకాలోని ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్ర దాస్ పై అల్లరిమూక దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టారు. మహ్మద్ ప్రవక్తను అతను అవమానించాడనే ఆరోపణలలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బంగ్లాలో మైనార్టీల రక్షణను మరింత ప్రశ్నార్ధం చేసింది. ఆందోళనలను అదుపు చేసేందుకు బంగ్లా ఆర్మీలో వీధుల్లో మోహరించింది.

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత హైకమిషన్‌ భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఏదైనా ఎమర్జెన్సీ సహాయం కోసం హైమిషన్‌, అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయాలను సంప్రదించాలని తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని..భారతీయుల రక్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేసిందని పేర్కొంది.