విధాత, హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ(Aarogyasri) పథకం నిధులు ప్రభుత్వ ఆసుపత్రులకే(Government Hospitals) అందించేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వసతులు తక్కువగా ఉండటం కారణంగా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసారని గుర్తు చేశారు. కానీ నేడు తెలంగాణలోని 32 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ పట్టణంలో మరో నాలుగు పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నవి . ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేసి , ఆయా హాస్పిటల్స్ లో పని చేసే డాక్టర్స్ కి ప్రోత్సహకాలు ఇచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడలని ప్రభుత్వానికి సూచిస్తున్నానని తెలిపారు.
నిమ్స్ హాస్పిటల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలని సూచించారు. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ నిధులను ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ డబ్బులు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగిస్తే.. ప్రైవేట్ ఆసుపత్రుల బ్లాక్ మెయిలింగ్ తగ్గవచ్చన్నారు. ఆరోగ్య శ్రీ,, సీఎంఆర్ఎఫ్ పథకాలపై మరోసారి సమీక్ష చేసుకోవాల్సి ఉందని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రులు ఏజెంట్లకు 30% కమిషన్ ఇస్తున్నాయని..ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ విధానంలో మార్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ ఏటా 2 వేల కోట్లకు ఈ పథకంపై ఖర్చు పెడుతున్నారని..ఇప్పటివరకు రూ.1789 కోట్లు ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ విషయంలోనూ ప్రభుత్వ కాలేజీలు, సంస్థలను బలోపేతం చేసేలా నూతన విధానం తీసుకరావాలన్నారు. ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హాస్టల్స్ ను ప్రభుత్వ స్కిల్స్ కి అనుసంధానం చేయాలని, వైద్యులు, టీచర్లలో జవాబుదారి తనం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు రాజ్యాధికార సాధన నినాదంతో కొత్తగా స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీపై స్పందించిన గుత్తా కులాలు, మతాల ప్రాతిపదికన రాజకీయ పార్టీల మనుగడ కొనసాగదని స్పష్టం చేశారు. అలాగే బీఆర్ఎస్ సస్పెండ్ ఎమ్మెల్యే కవిత తన రాజీనామాను ఆమోదించమని కోరారని..అయితే ఎమోషనల్గా రాజీనామా చేశారని, పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించానని గుత్తా వెల్లడించారు. కవిత రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాను అని తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పూర్తి అయ్యే లోపు డిండి నుంచి వృథాగా సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకునే విషయమై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వ వైఫల్యం లేదని..అదంతా అంతర్జాతీయ పరిణామాలపై ఆధార పడి ఉందన్నారు.