మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Aug 25, 2026, 6:27 pm IST
Read Time: 3 mins
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్‌ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-2 కి వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని చెప్పారు.

భూసేకరణ ప్రక్రియలో భూసేకరణ, ల్యాండ్‌ పూలింగ్‌, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఇందులో న్యాయపరమైన ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. మూసీ రివర్‌ఫ్రంట్‌లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు.

గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే, కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. మూసీ పునరుజ్జీవనం.. హైదరాబాద్‌ భవిష్యత్తుకు కీలకమైన ప్రాజెక్టు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.