శ్రీశైలంలోని సత్రంలో ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో ఉన్న ఓ సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతులు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్‌(36), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), గోగుల ఆదిలక్ష్మి(50), మణికంఠ(15)గా గుర్తించారు. 

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Aug 25, 2026, 11:36 am IST
Read Time: 2 mins
శ్రీశైలంలోని సత్రంలో ఐదుగురు ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ : శ్రీశైలంలో ఉన్న ఓ సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతుల్లో ఇద్దరు గదిలోని హాలులో ఫ్యాన్‌కు ఉరేసుకోగా, స్నానాల గదిలో ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాదాపు నెల రోజుల నుంచి వీరంతా వడ్డెరసత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మృతులు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్‌(36), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), గోగుల ఆదిలక్ష్మి(50), మణికంఠ(15)గా గుర్తించారు.

ఈనెల 20న సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. ఆటోలో వచ్చి శ్రీశైలం వడ్డెర సత్రంలో రూమ్ నంబర్ 12ను తీసుకున్నారు. గత 3 రోజులుగా బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.