విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై హైకమాండ్ సంతృప్తిగా లేనట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి కొండా సురేఖకు మరోసారి నోటీసులు జారీ చేశారు. కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తనకు సంబంధం లేదని గతంలో రెండులేఖల ద్వారా సురేఖ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేనందునా..సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మరోసారి నోటీసులు చేయడం గమనార్హం. దీనిపై కొండా సురేఖ వివరణ తర్వాతా ఏఐసీసీ, పీసీసీకి క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది.
అటు సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కొండా సురేఖను కేబినెట్ తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం సురేఖ వ్యవహారంలో ఎవరూ మాట్లాడవద్దని, ఆమె వ్యవహారాన్ని హైకమాండ్ చూస్తుందని, తగిన చర్యలు తీసుకుంటుందంటూ చెప్పడంతో ..రేపోమాపో కొండా సురేఖపై హైకమాండ్ చర్యలు తీసుకోవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది.
కొండా సురేఖ పవర్ కట్ !
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ అధికారాలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్న తీరు ఆమెపై పార్టీ హైకమాండ్ వేటు వేయడం ఖాయమన్న ప్రచారానికి ఊతమిస్తుంది. డిప్యూటేషన్పై అటవీ శాఖలోకి తెచ్చుకున్నఅధికారులను ఉన్న వారి మాతృశాఖలోకి పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మంత్రిగా ఆమె ఆదేశాలను ఎవరూ పాటించకూడదని సంకేతాలు ఇచ్చారు. కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరై ముగ్గురు అధికారులపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవడం ఆసక్తికరం. మరో వైపు మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ సెటిల్మెంట్లన్నీ బయటకు తీస్తున్నారు. సుమంత్ సహచరులను వరుస అరెస్టులు చేస్తున్నారు.