Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించిన సైంటిస్టుల బృందం!

Reported by: Y.V. Narsimha Reddy | latest | Jun 03, 2025, 1:27 pm IST
Read Time: 3 mins
Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించిన సైంటిస్టుల బృందం!

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ పరిస్థితిని పరిశీలించేందుకు మంగళవారం సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టుల బృందం డ్యామ్ ను సందర్శించింది. నలుగురు సభ్యుల సైంటిస్టు బృందం 2009లో భారీ వరదల వల్ల డ్యామ్ ముందు భాగాన వరద ఉధృతికి ఏర్పడ్డ ప్లంజ్ పుల్(గొయ్యి), గ్యాలరీ, గేట్లు, అప్రోచ్ రోడ్డును పరిశీలించింది. గతంలో నిపుణుల కమిటీ నివేదికలో 2009లో వరదలకు ఏర్పడ్డ గొయ్యితో డ్యామ్ భద్రతకి ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వాన కాలంలో డ్యాంకు వరద నీరు చేరనున్న క్రమంలో డ్యామ్ పటిష్టత..సామర్ధ్యాన్ని మరోసారి సైంటిస్టుల బృందం పరిశీలిచింది. క్రస్ట్ గేట్ల పనితీరు, స్టాప్ లాక్ ఎలిమెంట్స్, నీటి నిల్వను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సైంటిస్టుల బృందం ప్రభుత్వానికి నివేదికలు అందించనుంది.

ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కృష్ణ, తుంగభద్రల వరద ప్రవాహం డ్యామ్ కు పోటెత్తడంతో డ్యామ్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టుల బృందం మేనెల లో కూడా డ్యాంను పరిశీలించారు. డ్యామ్ ప్లంజ్ పుల్ లోతును ఆధ్యయనం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం కూడా ఇప్పటికే డ్యామ్ ను పరిశీలించి మరమ్మతుల ఆవశ్యతను తెలిపింది.