పశుసంవర్ధక శాఖలో రోజుకొక స్కామ్ బయటపడుతుంది. గొర్రెల స్కామ్లో అక్రమాలపై విచారణ కొనసాగిస్తున్న ఏసీబీకి ఆవుల కొనుగోలు స్కామ్ చిక్కింది
విధాత, హైదరాబాద్: పశుసంవర్ధక శాఖలో రోజుకొక స్కామ్ బయటపడుతుంది. గొర్రెల స్కామ్లో అక్రమాలపై విచారణ కొనసాగిస్తున్న ఏసీబీకి ఆవుల కొనుగోలు స్కామ్ చిక్కింది. సబ్సిడీ ఆవుల పంపిణీ స్కీమ్కు సంబంధించి 3కోట్ల నిధులను కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఆవుల సరఫరాదారులకు చెల్లించకుండా తమ బినామీ ఖాతాల్లోకి దారిమళ్లించి అవినీతికి పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. దీనిపై కేసు నమోదుకు సిద్ధమవుతుంది. గొర్రెల స్కామ్ చేసిన కాంట్రాక్టరే ఆవుల కొనుగోలులో కూడా అవినీతి చేసినట్లుగా గుర్తించారు.
ఆవుల కొనుగోలుకు ప్రభుత్వ నిధుల నుంచి 8.50 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఆవులు అమ్మిన సరఫరాదారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి. మిగిలిన 4.5 కోట్ల రూపాయలను బినామీ అకౌంట్స్ కి ముఠా సభ్యులు మళ్ళించారు. బాధిత సరఫరాదారులు నిలదీయడంతో ముఠా సభ్యులు కోటిన్నర రూపాయలను తిరిగి ఇచ్చారు. తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుంచి రావాలంటూ ఏసీబీ డీజీకి పుంగనూరు ఆవుల సరఫరాదారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
3కోట్లు స్వాహా
రైతులకు అవుల పంపిణీకి అప్పటి బీఆరెస్ ప్రభుత్వం నిర్ణయించి 8కోట్ల 50లక్షలను మంజూరు చేసింది. ఒక్కో ఆవుల యూనిట్ కి రూ.70వేల చొప్పున అధికారులు ఈ స్కీమ్ కు కేటాయించారు. ఆవుల కోసం చిత్తూరు జిల్లా పుంగనూరు సరఫరాదారులను అధికారులు ఆశ్రయించారు. 12 మంది నుంచి సుమారు 1200 యూనిట్లను అధికారులు కొనుగోలు చేశారు. తాము సరఫరా చేసిన ఆవులకు ఇవ్వాల్సిన డబ్బులలో నాలుగు నెలల నుంచి కూడా 4కోట్ల మేరకు మాత్రమే వారి ఖాతాల్లో జమ కావడంతో వారు 2022 మార్చిలో హైదరాబాద్కు వచ్చి ఆరా తీశారు.
అయితే అధికారుల అండతో తమకు ఇవ్వాల్సిన నిధులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా గుర్తించారు. సంబందం లేని ఖాతాలకు రూ.4కోట్ల 50 లక్షలు మళ్లినట్లు నిర్ధారణ చేసుకున్నారు. ఈ విషయమై అధికారులను, కాంట్రాక్టు ముఠా సభ్యులను సరఫరా దారులు నిలదీశారు. దీంతో ఒక సారి రూ.కోటి 5 లక్షలు, మరో విడతలో రూ. 40 లక్షలను బాధితులకు సంబంధిత వ్యక్తులు చెల్లించారు. మిగిలిన మొత్తం 3కోట్ల డబ్బుల విషయంలో మళ్లీ మొండికేయడం, అటు ఆవులు ఇచ్చిన రైతులు వారిని డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో బాధిత సరఫరాదారులు పుంగనూరుకు చెందిన కీలక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు.
కాగా.. ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రజాప్రతినిధి దృష్టికి వారి సమస్యను తెలిపారు. అయినా తమ సమస్య పరిష్కారం కాకపోవడం, పైగా ముఠా సభ్యులు వారిపై బెదిరింపులకు పాల్పడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో సరఫరాదారులు చివరకు రైతుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక పొరుగు రాష్ట్రాలలో తలదాచుకునేందుకు పారిపోయారు. వారిలో కొందరు తమకు జరిగిన అన్యాయంపై ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేయడంతో ఆవుల స్కామ్ బట్టబయలైంది.