AP
విధాత: చాన్నాళ్లుగా తనను పార్టీ పట్టించుకోలేదని, అధిష్టానం అవమానకరంగా మాట్లాడుతోందని ఆరోపణలు చేసిన గన్నవరం వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు.. అనుకున్నట్లే ఒక్కరోజులోనే చంద్రబాబు ఎపాయింట్మెంట్ పొందారు. ఆదివారం హైబారాబాదులో చంద్రబాబును కలిశారు. ఇదిలాఉండగా, కృష్ణా జిల్లా గన్నవరంలో యార్లగడ్డ 2019లో పోటీ చేసి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తరువాత వంశీ వైసీపీలో చేరిపోవడంతో యార్లగడ్డకు చిక్కొచ్చి పడింది. వంశీ దూకుడు ముందు వెంకట్రావు నిలవడం కష్టమైంది.
ఇన్నాళ్లూ ఆయన వెనకున్న క్యాడర్ మెల్లగా వంశీ వెంట నడవడం మొదలు పెట్టారు. దీంతో యార్లగడ్డకు గడ్డురోజులు మొదలయ్యాయి. అయినా సరే ఆయన్ను వైసీపీ కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా నియమించింది. ఇటీవలనే అయన చైర్మన్ పదవీకాలం పూర్తి అవగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం అన్నట్లుగా పార్టీకి సూచనలు పంపాడు. అయితే జగన్ మాత్రం టికెట్ వంశీకే ఇస్తున్నామని, ఇద్దరూ కలిసి పని చేయాలనీ, తరువాత ఆయనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా, యార్లగడ్డ కుదుటపడలేదు.
మొన్న కార్యకర్తల సమావేశంలో ఆవేదనతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను ఈసారి వంశీని ఓడించి అసెంబ్లీకి వస్తానని, జగన్ పులివెందులలో గెలిచి అసెంబ్లీకి వస్తారని, ఇద్దరం అక్కడ కలుస్తామని అన్నారు. ఇక చంద్రబాబును కలిసిన యార్లగడ్డ… గన్నవరం టికెట్ తనదే అన్నట్లుగా ప్రకటన చేశారు. టీడీపీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తానని చెప్పారు. గుడివాడలో చేయమన్నా చేస్తానన్నారు.