ఆసీస్ మాజీల కామెంట్లతో బోర్డర్-గవాస్కర్ సిరీస్పై పెరిగిన హీట్ ఆసీస్తో టెస్టు సిరీస్కు ముందుగా పిచ్లపై రభస టర్నింగ్ వికెట్తోనే టీమ్ ఇండియా విజయాలంటూ వక్ర భాష్యం క్రికెట్ పిచ్ అంటే ఎలా ఉండాలి..? స్పిన్ లేదా పేస్ వికెట్..? బ్యాటింగ్ ట్రాక్ లేదా బౌలింగ్ ట్రాక్..? రెండింటికీ సమంగా ఉండేలా స్పోర్టివ్ వికెట్..? అసలు పిచ్ ఎలా ఉండాలి అన్న వాదనలో బలమెంత? రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుంటే జట్ల బలాబలాలు లేదా […]
క్రికెట్ పిచ్ అంటే ఎలా ఉండాలి..? స్పిన్ లేదా పేస్ వికెట్..? బ్యాటింగ్ ట్రాక్ లేదా బౌలింగ్ ట్రాక్..? రెండింటికీ సమంగా ఉండేలా స్పోర్టివ్ వికెట్..? అసలు పిచ్ ఎలా ఉండాలి అన్న వాదనలో బలమెంత? రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుంటే జట్ల బలాబలాలు లేదా ప్లేయర్ల సామర్థ్యం మీద చర్చ జరగాలి.. కానీ అదేం విచిత్రమో.. భారత్లో విదేశీ జట్ల పర్యటన అంటే ముందుగా క్రికెట్ పిచ్లపైనే చర్చ.. టర్నింగ్ వికెట్తో క్రికెట్ మ్యాచ్లు గెలుస్తారు.. లేదంటే టీమ్ ఇండియా క్రికెటర్లకు అంత సీన్ లేదు.. స్పోర్టివ్ వికెట్ ఉంటే మేమే గెలుస్తాం అంటూ విభిన్న వాదనలు.. పసలేని కామెంట్లు వినిపిస్తుంటాయి.. మరి భారత్ మాత్రమే పిచ్లతో లబ్ధి పొందుతుందా..? ఏ దేశ జట్లకూ లబ్ధి ఉండదా..? మరి ఎందుకు భారత్తో ఆడే సమయంలో మాత్రమే ఇంత రచ్చ.. ఆటకు సంబంధించిన విషయాల కంటే పెద్ద రభస జరగుతుంది అంటే అంతుతెలియని ప్రశ్నే..?
విధాత ప్రత్యేకం: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా భారత్లో 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు వచ్చింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్గా పిలుచుకునే ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఆటగాళ్ల బలాలు.. బౌలర్ల ఘనతల కంటే భారత పిచ్ లపైనే చర్చ సాగడం నిరాశను కలిగిస్తుంది. మన పిచ్లపై ఆడేంత సామర్థ్యం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు లేదన్నట్లుగా వ్యాఖ్యానాలు వినిపించడం వారి స్థాయిని తగ్గించడమే అనిపిస్తుంది. సహజంగానే ఆస్ట్రేలియాలో బౌన్సీ వికెట్లు ఉంటాయి.
అంతేకాదు అక్కడి క్రికెట్ మైదానాలు కూడా చాలా పెద్దవి. ఫోర్లు, సిక్సర్లు కొట్టాలంటే చాలా కష్టం.. ఆస్ట్రేలియాలో పర్యటించే జట్లు వాళ్ల సూపర్ ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కోవడం అంటే చాలా కష్టంఅప్పుడు మన జట్ల బ్యాట్స్ మెన్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యానాలు చేస్తారు. బ్యాటింగ్ చేయడం రాని వాళ్లంతా ఇక్కడికొస్తారు అన్నట్లుగా మాట్లాడుతారు.
ఆస్ట్రేలియాలోని వాకా, బ్రిస్బేన్, అడిలైడ్ ఇలాంటి చోట బౌన్సీ ట్రాకులు కాకుండా స్పిన్నింగ్ ట్రాకులు కావాలని మనం కోరితే వారు చేస్తారా..? ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో స్పీడ్ ట్రాక్ కాకుండా టర్నింగ్ వికెట్ ఉంటుందా..? సౌతాఫ్రికా లో వేగవంతమైన వికెట్లు కాకుండా మా బౌలర్లకు కావలిసిన వికెట్లు కావాలంటే ఇస్తారా..? అక్కడి స్థానికంగా వాతావరణ మార్పులు, మట్టి.. పిచ్ను నిర్దేశిస్తాయి. సహజంగా న్యూజిలాండ్లో గాలిలోనే బంతి స్వింగ్ కావడం చూస్తుంటాం.
ఇంగ్లండ్ లోనూ స్వింగ్ బౌలింగ్ ప్రధాన పాత్ర.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ల ట్రాక్ పై స్పీడ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి వారి వికెట్లపై రాణించలేకపోతే భారత బ్యాట్స్ మెన్ సామర్థ్యం శంకిస్తారా? స్వదేశంలోనే పులులు అని మనల్ని వెక్కిరిస్తే.. మన గడ్డపై ఓడినవారికి సైతం ఇదే వర్తించదా..? భారత్ తో జరుగబోయే సిరీస్లో ఓటమి తప్పదని ముందే సాకులు వెతకడం ఎంటో ఏం చెప్పినా అర్థం కాదు.. భారత్ లో మాత్రం విదేశీ ఆటగాళ్లు ఆడలేకపోతే పిచ్లను నిందిస్తారు. టర్నింగ్ వికెట్లను పెట్టుకుని విజయాలు సాధిస్తున్నారని మన సామర్థ్యాన్ని తక్కువ చేసి విదేశీ మీడియా కూడా పుంఖానాలుగా కథనాలు రాస్తారు.
స్వదేశంలో మన రికార్డు ఘనం
కొత్త మిలీనియం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మనం స్వదేశంలో కేవలం రెండంటే రెండు టెస్టు సిరీస్ లు మాత్రమే ఓడిపోయామంటే మన ఘనత తెలుసుకోవచ్చు.. 2004-05లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో 2-1 తేడాతో.. 2012-13 టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో 2-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది.
ఇవి రెండు సిరీస్లు మినహా భారత్కు స్వదేశంలో ఎదురే లేదు. అంతేకాదు గత ఐదేండ్లలో భారత్ స్వదేశంలో కేవలం రెండంటే రెండు టెస్టుల్లో ఓడిపోయింది. 2017లో ఇదే ఆస్ట్రేలియా జట్టు చేతిలో పుణె టెస్టులో.. 2021 పాండమిక్ సిచ్యుయేషన్ లో చెన్నైలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడింది.
అంతే ఇక మళ్లీ టెస్ట్ మ్యాచ్లో స్వదేశంలో భారత్ ఓడిందే లేదు. ఈ విజయాలన్నీ టర్నింగ్ వికెట్ల వల్లేనా ? మరి ఈ దిగ్గజ స్పిన్నర్లు ఎవరు? జాసూ పటేల్, వినూ మన్కడ్, ప్రసన్న, బేడీ, చంద్రశేఖర్, వెంకట్రా ఘవన్, కుంబ్లే లాంటి ఎందరో మేటి విశ్వవిఖ్యాత స్పిన్నర్లను భారత్ అందించింది. వీరంతా చేవ లేని వారా..? హర్భజన్ సింగ్, వెంకటపతి రాజు, రవిచంద్రన్ అశ్విన్లే కాకుండా ప్రస్తుతం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చైనామెన్ కుల్దీప్.. వీళ్ల బౌలింగ్కు విలువ లేదా..?
ఎన్నో ఘనతలు.. ఆసీస్ జట్టులో ఘనత వహించిన ఎందరో మేటి స్పిన్నర్లు విఫలమైన చోట.. షేన్ వార్న్ లాంటి దిగ్గజ స్పిన్నర్ను ఎదుర్కొన్న భారత బ్యాటింగ్ బలం.. వెరసి స్వదేశీ గడ్డపై భారత్ బలాన్ని రెట్టింపు చేశాయి గాని పిచ్ల వల్ల కాదనేది నిజం.. మరి ఇవన్నీ తెలిసి కూడా ఆసీస్ మాజీలు గ్రెగ్ చాపెల్ సహా మిగిలిన వారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సిరీస్ ఫలితం వారికి అర్థమైంది అందుకే ఓటమికి ముందే సాకులు చెబుతున్నారనిపిస్తుంది.
గతంలో ఫ్యాబ్ ఫోర్ (సచిన్, వీవీఎస్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ) భారత్ బలం కాగా.. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ, పుజారా, రాహుల్ లాంటి బ్యాట్స్ మెన్.. అశ్విన్ , జడేజాల ఆల్ రౌండ్ నైపుణ్యం.. రాహుల్ ద్రవిడ్ లాంటి కోచ్ ఇవన్నీభారత్ కు అదనపు బలాలే. ఇదీ భారత్ నిజమైన బలం. మరి ఆసీస్ జట్టులో స్మిత్, లబుషేన్, ఖవాజా, వార్నర్ లాంటి సూపర్ బ్యాట్స్ మెన్.. ట్రావిస్ హెడ్, గ్రీన్ లాంటి సూపర్ ఆల్ రౌండర్లు, మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, కెప్టెన్ పాట్ కమిన్స్ లాంటి ఎక్స్ ప్రెస్ బౌలర్లు.. నాథన్ లైయోన్ లాంటి సీనియర్ స్పిన్నర్ కు తోడుగా మర్ఫీ, అగర్ లాంటి కుర్ర స్పిన్నర్లు మరి ఏం తక్కువ కంగారూ జట్టుకు. ఈ సిరీస్లో రెండు జట్లూ సమంగా కనిపిస్తున్నా..స్వదేశంలో భారత రికార్డు దడపుట్టిస్తున్నది. వణికిస్తున్నది. అందుకే ఈ మాటలు.. ఈ విమర్శలు.. ఏది ఏమైనా ఈ సిరీస్లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. సిరీస్ ముగిసే సరికి మరిన్ని విమర్శలు రాక మానవు.