Mancherial పార్టీలకు అతీతంగా బీసీల ఐక్యతారాగం అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యంపై తిరుగుబావుటా విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలో అగ్రవర్ణాల అధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీసీ వాదం బలపడుతుంది. 1952 నుండి నేటి వరకు రెడ్డి , రావులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఈ నియోజకవర్గంలో ఉంది. మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు […]
Mancherial
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలో అగ్రవర్ణాల అధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీసీ వాదం బలపడుతుంది. 1952 నుండి నేటి వరకు రెడ్డి , రావులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఈ నియోజకవర్గంలో ఉంది. మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కావడంతో ఒక మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే జనరల్ స్థానంగా కొనసాగుతుంది.
మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి టికెట్ల కోసం ఒక్కొక్క పార్టీలో ఇద్దరి నుండి ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో అధికార పార్టీ నుండి ఎక్కువ సంఖ్యలో ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని పార్టీలలో ఈ టర్మ్ బీసీలకే టికెట్ ఇవ్వాలని బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఐక్యంగా అధిష్టానంతో మంతనాలు చేస్తూ ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
1952 నుండి లక్షెట్టిపేట అసెంబ్లీ స్థానం పేరుతో కొనసాగిన ఈ నియోజకవర్గం 2009 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంగా మారింది. 1952 నుండి మంచిర్యాలగా పేరు మారినప్పటివరకు అత్యధికులు అగ్రవర్ణాలకు చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన శాసన సభ్యులు మినహాయిస్తే రెడ్డి, రావులే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారే ఉన్నారు. 60% జనాభా ఉన్న బీసీలను కాదని కేవలం రెండు నుండి తొమ్మిది శాతం మాత్రమే ఉన్న ఓసీలు ఎక్కువసార్లు ఎమ్మెల్యే పదవులను అనుభవించడం పట్ల బీసీల్లో చైతన్యం పెరిగింది. ఈసారి ఎలాగైనా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న తపన బీసీ సామాజికవర్గంలో బలంగా వెళ్ళింది. క్రమంగా పార్టీలకు అతీతంగా బీసీ వాదానికి బలం చేకూరుతుంది.
1952లో లక్షెట్టిపేట నియోజకవర్గంగా ఏర్పడిన తొలినాళ్లలో బీసీ వర్గానికి చెందిన నాయకులు కోదాడ రాజమల్లు, రెండు సంవత్సరాలు,1978 నుండి 1983 వరకు చుంచు లక్ష్మయ్య మాత్రమే శాసన సభ్యులుగా కొనసాగారు. మిగిలిన పర్యాయాలు పీతంబర్రావు రెండుసార్లు, విఎన్.రావు, జేవి.నర్సింగ్రావు, మురళీ మనోహర్ రావు, జీవి సుధాకర్ రావు, గోనె హనుమంతరావు, గడ్డం అరవింద్ రెడ్డి, నడిపెల్లి దివాకర్ రావు లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
లక్షెట్టిపేట నియోజకవర్గం కాస్త 2009 మంచిర్యాల నియోజకవర్గంగా పేరు మారిన తర్వాత గడ్డం అరవింద్ రెడ్డి 2009 నుండి రెండుసార్లు గెలిచినప్పటికీ, ఒకసారి ఉప ఎన్నికల్లో భాగంగా ఒక సంవత్సరం కాలం మాత్రమే ప్రాతినిధ్యం వహించగా, రెండవ దఫా గెలిచి 2014 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా అరవింద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆరు సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగారు.
2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆరెస్ పార్టీ నుండి అరవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నడిపల్లి దివాకర్ రావు బీఆరెస్ పార్టీ లోకి వచ్చారు . అప్పటినుండి నేటి వరకు నడిపల్లి దివాకర్ రావు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివాకర్ రావు ఇప్పటివరకు 4 టర్ములు ఎమ్మెల్యేగా గెలుపొందారు . రెండుసార్లు లక్షెట్టిపేట నియోజకవర్గంలో, రెండుసార్లు మంచిర్యాల నియోజకవర్గంలో గెలుపొందారు. 5వ సారి బీఆరెస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని మంచిర్యాల నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు.
1952 నుండి ఇప్పటివరకు జనాభాలో రెండు శాతం ఉన్న రావు సామాజిక వర్గం 60 సంవత్సరాల పాటు మంచిర్యాల నియోజకవర్గం లో ప్రాతినిధ్యం వహించగా , రెడ్డి సామాజిక వర్గం ఆరు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించింది బీసీ సామాజిక వర్గం 10 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు.
ఈ నేపధ్యంలో సుమారు 60 శాతం జనాభా ఉన్నమెజార్టీ బీసీలను కాదని కేవలం అత్యల్ప శాతం ఉన్న అగ్రవర్ణాలైన రావులకు, రెడ్డిలకు మాత్రమే అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల బీసీ వర్గాల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించాలంటూ బీసీ నాయకులు బలమైన వాదం వినిపిస్తున్నారు.
గడిచిన రాజకీయ చరిత్రను బేరీజు వేసుకుంటే ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరిగేలా వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదనకు బలం చేకూరుతుంది. ఏది ఏమైనా ఏ పార్టీలు కూడా ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో ఆరు నూరైనా తాము ఎన్నికల బరిలో నిలబడతామంటూ బీసీ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్, నస్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది అక్కల తిరుపతి వర్మ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికె టికెట్ ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలను రాజకీయ పార్టీలు గుర్తించి పార్టీల టికెట్ కేటాయించకపోతే బీసీలలో ఒకరిని ఎంచుకొని ఇండిపెండెంట్ గా పోటీ చేయించి మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ లందరూ ఒక తాటి పైకి వచ్చి బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటామని బీసీల సత్తా ఏమిటో నిరూపించుకుంటామని చెబుతున్నారు. బీసీ వర్గాలకు ఏ పార్టీ గుర్తించి టికెట్ ఇస్తుందో.. ఇప్పుడున్న బీసీ ఐక్యతా ఎన్నికల నాటికి ఉంటుందా వేచి చూడాల్సి వుంది.