Bhatti Vikramarka కాంగ్రెస్తోనే హైదరాబాద్ అభివృద్ధి అందుకే కోకాపేట భూములకు రెక్కలు ఔటర్ టెండర్ రద్దు చేయాలి డ్రైనేజీ వ్యవస్థ లోపాలతోనే హైదరాబాద్లో వరదలు రెండు లక్షల బెడ్రూమ్ల కట్టామని 30వేలే చూపించారు అసెంబ్లీ చర్చలో సీఎల్పీ నేత భట్టి విధాత: పల్లె, పట్టణ ప్రగతి పథకాలు గొప్పగా పెట్టడం కాదని, వాటి అమలుకు కావాల్సిన నిధులివ్వాలని, గ్రామ పంచాయతీలలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఎల్పి నేత భట్టి […]
Bhatti Vikramarka
విధాత: పల్లె, పట్టణ ప్రగతి పథకాలు గొప్పగా పెట్టడం కాదని, వాటి అమలుకు కావాల్సిన నిధులివ్వాలని, గ్రామ పంచాయతీలలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చలో భట్టి మాట్లాడుతూ.. సర్పంచుల్లో చాలామంది బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ఉన్నందున వారిని ఇబ్బందులు పెట్టకుండా వారు చేసిన పనులకు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రంలోని అనేక గ్రామపంచాయతీలలో ట్రాక్టర్లకు ఈఎంఐ కిస్తులు కట్టలేక డీజిల్ సమకూర్చలేక చాలామంది సర్పంచులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరు నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో సర్పంచులు నిధులు వస్తాయన్న ఆశతో అభివృద్ధి పనులు చేసి కాళ్ళు అరిగేలా ప్రభుత్వం చుట్టు తిరుగుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయని, వలసలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్ను డల్లాస్ గ్లోబల్ సిటీగా మార్చామని చెప్పడం సరికాదని, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది బీఆరెస్ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్లో రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టామని చెప్పినప్పుడు చూపించాలని కోరగా నా వెంట వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేవలం 30 వేల ఇండ్లు మాత్రమే చూపించారన్నారు.
మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల హైదరాబాద్లో చినుకు పడితే గంటల కొలది ట్రాఫిక్ నిలిచిపోతున్నదన్నారు. హైదరాబాదులో బీహెచ్ఈఎల్ డిఆర్డిఓ ఐఐటి త్రిబుల్ ఐటీ హైటెక్ సిటీ ఫైనాన్స్ డిస్టిక్ ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ డిజైన్ చేసి నిర్మించడం వల్లే అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ బీఆరెస్ వల్ల కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం వల్లనే సాధ్యమైందన్నారు.
కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలకు ఊరికే అమ్ముడుపోలే.. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇంటర్నేషనల్ కంపెనీలను తీసుకురావడం వల్లనే భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ప్రజలకు ఉపయోగపడాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాల పాటు లీజుకు ఒక ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారన్నారు.
30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చి ఒకేసారి డబ్బులను తీసుకుంటే రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. ఒకేసారి పన్నులు సేకరించి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎలా అభివృద్ధి చేస్తాయి? ఇది ఎక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.
రెండు లక్షల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఔటర్ రింగ్ రోడ్డును 7వేల కోట్ల రూపాయలకు లీజుకు ఎలా ఇస్తారని నిలదీశారు. ఐఆర్బి ఇన్ఫ్రా కంపెనీకి ఔటర్ రింగ్ రోడ్డును ధారాదత్తం చేయడాన్ని కాంగ్రెస్ శాసనసభక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. దీనిపై సమగ్ర సమాచారాన్ని సభకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాదుకు మణిహారం వంటిదని, భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరిన్ని పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కొత్తగా కాలనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పరిధిలోనే ఔటర్ రింగ్ రోడ్డును ఉంచుకోవాలన్నారు.
ఐఆర్బీ ఇన్ఫ్రా కంపెనీకి ఇచ్చిన లీజును ప్రభుత్వం ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో డ్రైనేజీ సిస్టంను అప్గ్రేడ్ చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టము మెరుగుపరచాలన్నారు.
మధిర మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఏర్పాటుకు తగిన నిధులు ఇవ్వాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందని, మున్సిపల్ శాఖ మంత్రి ని వ్యక్తిగతంగా కలిసి వినతి పత్రం ఇచ్చామని దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.