విధాత: త్వరలో తాను నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ,రంగారెడ్డి మొత్తం నాలుగు జిల్లాలను కలుపుకొని బస్సు యాత్ర లేదా బైక్ యాత్ర ఏదో ఒకటి చేపడతానని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ హోటల్ ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలలో పూర్తిగా బైక్ యాత్ర త్వరలో చేస్తానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రేవంత్రెడ్డి కూడా ఊర్లలో పాదయాత్ర చేసుకుంటూ గ్రామాలు, జనం లేని వద్ద కారులో ఎక్కి ప్రయాణిస్తున్నారని, ఆయనది సగం పాదయాత్ర, సగం బస్సు యాత్ర అన్నట్లుగా ఉందని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందన్నారు. ఈనెల 13న పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత బైక్ యాత్ర చేపడతానని స్పష్టం చేశారు.
రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి మాత్రమేనని, రెండు లక్షల 90 కోట్లు గతంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టి రెండు లక్షలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. 2023-24 బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అని విమర్శించారు.
పేదోడికి ఎన్ని ఇళ్లు కట్టిస్తామో అని బడ్జెట్లో పెట్టలేదన్నారు. గతంలో ఐదు లక్షలు ఇస్తామని, ఇపుడు మూడు లక్షల అంటున్నారని, ఇవి కూడా ఇస్తారో ఇవ్వరో కూడా తెలవని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.