BJP | బీజేపీ మళ్లొస్తే.. పన్నుల మోతే?
BJP ఇక బ్యాంకులో వంద పడితే 3 రూపాయల పన్ను! వచ్చే టర్మ్లో అమలు చేసే యోచనలో కేంద్రం? ఇప్పటికే ఆర్థికశాఖ ప్రాథమిక కసరత్తు పూర్తి! ఇప్పటికే రకరకాల పన్నుల మోత సతమతమవుతున్న మధ్యతరగతి పేదలకూ తప్పని జీఎస్టీ భారాలు దేశానికి పెరుగుతున్న అప్పులు జనం నెత్తిన మోపేందుకు ప్లాన్? డబ్బులేస్తే పన్ను.. డబ్బు తీస్తే పన్ను! బ్యాంకులే కేంద్రాలుగా వసూళ్లు? నరేంద్ర మోదీ సర్కారు ఆలోచన! రకరకాల పన్నులతో సతమతమవుతున్న భారతీయులకు ప్రధాని మోదీ మరో […]

BJP
- ఇక బ్యాంకులో వంద పడితే 3 రూపాయల పన్ను!
- వచ్చే టర్మ్లో అమలు చేసే యోచనలో కేంద్రం?
- ఇప్పటికే ఆర్థికశాఖ ప్రాథమిక కసరత్తు పూర్తి!
- ఇప్పటికే రకరకాల పన్నుల మోత
- సతమతమవుతున్న మధ్యతరగతి
- పేదలకూ తప్పని జీఎస్టీ భారాలు
- దేశానికి పెరుగుతున్న అప్పులు
- జనం నెత్తిన మోపేందుకు ప్లాన్?
- డబ్బులేస్తే పన్ను.. డబ్బు తీస్తే పన్ను!
- బ్యాంకులే కేంద్రాలుగా వసూళ్లు?
- నరేంద్ర మోదీ సర్కారు ఆలోచన!
రకరకాల పన్నులతో సతమతమవుతున్న భారతీయులకు ప్రధాని మోదీ మరో షాక్ ఇవ్వనున్నారా? ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అప్పుల భారం తీర్చుకోవడానికి జనం నెత్తిన పన్నుల రూపంలో భారం మోపనున్నారా? డబ్బులు వేస్తే పన్ను, తీస్తే పన్ను, పన్ను మీద పన్ను..! ఇదేనా మోదీ మదిలో అమలు చేయాలనుకుంటున్న ఆర్థిక ప్రణాళిక? ఇప్పటివరకు సంపన్నవర్గాలు, ఆదాయ వర్గాలు మాత్రమే కడుతున్న ప్రత్యక్ష పన్నులను ఇక ఆమ్ అద్మీకి కూడా వర్తింపజేస్తే దేశ ఆదాయంలో భారీ వృద్ధి ఉంటుందని మోదీ సర్కార్ ఆలోచన చేస్తున్నదా? బీజేపీ సర్కార్ భవిష్యత్ ప్లాన్పై ఢిల్లీలోని ఆదాయం పన్ను శాఖలో పనిచేసే ఓ సీనియర్ అధికారి చెప్పిన ఆ వ్యూహం వింటే మీరు షాక్ అవుతారు.
విధాత ప్రతినిధి, హైదరాబాద్: మీరు చేసిన కష్టానికి వచ్చే ప్రతిఫలం మీ అకౌంట్కు వంద రూపాయలు జమ అయినా సరే అందులో మూడు రూపాయలు టాక్స్ రూపంలో మీ ప్రమోయం లేకుండానే నేరుగా బ్యాంకు నుంచి ప్రభుత్వానికి వెళుతుంది. ఈ మేరకు ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
ఈ సొమ్ము సంపన్నులదా, ఉద్యోగులదా, రైతులదా, కూలీలదా, చివరకు అడుక్కునే కుష్టువ్యాధిగ్రస్తుడిదా? అన్న దాంతో ప్రభుత్వానికి నిమిత్తం ఉండదట! ఎలా సంపాదిస్తున్నారు అన్నది కూడా ప్రభుత్వానికి అవసరం లేదట! ఇప్పుడు ఉన్న ఆదాయం పన్ను శ్లాబులను పూర్తిగా ఎత్తివేసి, పైన వంద రూపాయల కథలాంటి కొత్త పన్ను విధానాన్ని (టీడీఎస్) ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో బీజీపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసిందని ఢిల్లీలోని ఆదాయం పన్నుశాఖ విభాగంలో పనిచేసే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇదే అమలైతే భారత్లో ఉన్న 140 కోట్లమంది పన్ను పరిధిలోకి అనివార్యంగా నెట్టబడతారని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. 3శాతం పన్ను విధానంతో పాటు జీఎస్టీ తదితర పరోక్ష పన్నులు కూడా యథావిథిగా అమలు చేస్తారని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత విధానంలో…
ప్రస్తుతం భారత్లో ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 6.77 కోట్ల మంది ఆదాయం పన్ను (ఐటీ రిటర్న్స్) దాఖలు చేశారు. గత ఏడాది 5.83 కోట్లమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. అంటే ఈసారి 16 శాతానికి పైగా కొత్తగా ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ. 3,41,568 కోట్లు సమకూరితే.. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్ 17 నాటికే ఈ మొత్తం 3,79,760 కోట్లకు పెరిగింది.
అంటే 11.18 శాతం ఆదాయం పెరిగినట్లు 2023 జూన్ 19న ఆదాయం పన్ను శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంటున్నది. ఈ విధానంలో రూ. 5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారికి, రైతులకు ఆదాయం పన్ను మినహాయింపు ఉన్నది. ప్రస్తుత విధానంలో మొత్తం 10 కోట్ల మందిలోపే ఆదాయం పన్ను చెల్లిస్తుండగా, బీజేపీ తీసుకు రానున్న నూతన విధానంలో ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి వచ్చేస్తారని సీనియర్ అధికారి తెలిపారు.
దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని, సాఫ్ట్వేర్ను ఇప్పటికే పైస్థాయి ఐటీ అధికారుల ముందు ఉంచి డెమో ఇచ్చినట్లు కూడా సమాచారం. ఇదే కనుక అమలైతే దేశంలో పన్నుల ద్వారానే ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం కాస్తా కోట్ల కోట్లలో కి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరోక్షపన్నులు అందరిపైనా…
ప్రస్తుత విధానంలో అనేక విధాల పన్నులు చెల్లిస్తున్నాం. పరోక్ష పన్నులను దేశంలోని ప్రతి ఒక్కరూ ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పడు జీఎస్టీ రూపంలో… పెట్రోల్, డిజిల్ కొనుగోలు చేసినప్పుడు పన్నుల రూపంలో చెల్లిస్తుండగా, ప్రత్యక్ష పన్నులు మాత్రం కేవలం నిర్దేశిత ఆదాయ వర్గాలు మాత్రమే చెల్లిస్తున్నాయి.
ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా ఆదాయం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. రైతులు, పేదలు, అల్పాదాయ వర్గాలు, చిరు వ్యాపారులు, సీనియర్ సిటిజన్స్, మహిళలకు, పిల్లలకు మినహాయింపులు ఉన్నాయి. అయినప్పటికీ ఈ మల్టిపుల్ పన్నుల విధానంలో పన్ను చెల్లింపు పరిధిలో ఉన్న ఒక ఉద్యోగి కానీ, వ్యాపారస్థుడు కానీ దాదాపు 48 శాతం వరకు వివిధ రూపాలలో పన్ను చెల్లిస్తాడని ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ అన్నారు.
మార్చి 2022 నుంచి ఒకేసారి ఎవరైనా వ్యక్తి కానీ, సంస్థ కానీ రూ. 20 లక్షల పైచిలుకు విత్డ్రా చేస్తే నేరుగా రెండు శాతం టీడీఎస్ కట్ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.
కొత్త విధానంలో…
బీజేపీ ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు చెబుతున్న కొత్త తరహా పన్ను విధానంలో అందరూ ఒకటే కాబోతున్నారు. ప్రతి రూపాయి సంపాదనకు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ సమాన పన్ను వసూలు చేయనున్నారు.
దీంతో దేశంలో ఇప్పటి వరకు పన్ను మినహాయింపులున్న వివిధ వర్గాల ప్రజలు తమ ప్రమేయం లేకుండానే బలవంతంగా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేరుగా బ్యాంకులే టీడీఎస్ కట్ చేసి కేంద్ర ప్రభుత్వ అకౌంట్లో జమ చేస్తాయని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంతో దేశంలో 70 కోట్ల మంది ప్రజలు బ్యాంకు అకౌంట్లు తీసుకొని లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరంతా పేటీఎం, గూగుల్ పే లాంటి వాటి ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పైగా సామాజిక పెన్షన్లు, ప్రభుత్వాలు వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి.
ఇలా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించిన ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించిన రైతులపై కూడా పన్ను వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది కానీ, రైతులు ఇప్పటికే చేసిన ఉద్యమాల కారణంగా తీవ్ర వ్యతిరేకత వస్తుందని వెనుకడుగు వేసింది. ఈ విధానాన్ని మార్చి కొత్త పాలసీలో అందరినీ పన్ను పరిధిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నదని చెబుతున్నారు.
కొత్త విధానం ఎవరికి మేలు చేస్తుందంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే తీసుకురావాలనుకుంటున్నదని చెబుతున్న కొత్త విధానంలో పన్ను కేవలం 3 శాతమే కదా అనిపిస్తుంది. కానీ సంపాదించే ప్రతి రూపాయిపైన 3శాతం చొప్పున పన్ను వసూలు చేసే విధానంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమకు తెలియకుండానే భారీ ఎత్తున పన్ను చెల్లించి నష్టపోతారు. కానీ బడా వ్యాపారులకు మాత్రం భారీ ప్రయోజనం ఉంటుందని చెపుతున్నారు.
ఇప్పడు అమలులో ఉన్న విధానంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పడు ప్రతి పైసా ఏవిధంగా సంపాదించామో ఆదాయ పన్ను శాఖకు లెక్కలు చెపుతాము… కానీ కొత్త విధానంలో రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని, అలాంటప్పుడు ఏ విధంగా ఆదాయం సంపాదించామో చెప్పాల్సిన అవసరం లేదని ఆర్థిక రంగ నిపుణులు చెపుతున్నారు.
కొత్త విధానంలో ఆదాయం ఎలా సంపాదించారన్నది ముఖ్యం కాదని, సంపాదించుకున్న సొమ్ములో 3శాతం పన్ను చెల్లించారా లేదా అన్నదే కీలకమని అంటున్నారు. ఈ విధానంలో జీరో దందా చేసే వారికి, బ్లాక్ మనీ చలామణి చేసే వారికి చాలా ఉపకరిస్తుందని, వారంతా బ్లాక్ మనినీ 3శాతం పన్ను నేరుగా చెల్లించి వైట్ చేసుకుంటారని అంటున్నారు.
ఈ విధానం అమలులోకి వస్తే విదేశీ బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్నవాళ్లంతా దేశానికి తీసుకువచ్చి బ్యాంకుల్లో జమ చేస్తారని, దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. నల్లధనాన్ని వైట్ చేసుడేమో కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పరిస్థితి ఏమిటన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.