Bandi Sanjay
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రుల కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం గత కొంత కాలంగా పార్టీ సంస్థాగత మార్పులతోపాటు సెంట్రల్ కేబినేట్ మార్పులు చేయడంపై వరుస భేటీలు నిర్వహిస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చతో పాటు, మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ సేవలకు వాడుకోవాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ మేరకు అధ్యక్షుల మార్పు జరిగింది.
ఏపీలో సోము వీర్రాజును తప్పించి పురందేశ్వరికీ, తెలంగాణలో బండి సంజయ్ని తప్పించి కిషన్రెడ్డిని పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరికొంతమందిని కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. వారందరితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమై మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ నుంచి బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని సమాచారం. ఏపీ నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి పేర్లు వినిపించడం లేదు. మొత్తంగా నేడు (బుధవారం) లేదంటే గురువారమే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకశమున్నట్లు తెలుస్తోంది. జూలై 20న పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. బుధ, గురువారాల్లో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.