కొవిడ్ కేసులు, మరణాలపై కచ్చితమైన డేటా కోసం వివిధ దేశాల డిమాండ్ ఎట్టకేలకు పెదవి విప్పిన డ్రాగన్ దేశం శనివారం ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారిక నివేదిక విడుదల ఈ గణాంకాలు ఆస్పత్రుల్లో చోటుచేసుకున్నవి మాత్రమే.. మరణాలు ఎక్కువే ఉండొచ్చు విధాత: చైనాలో కొవిడ్ కేసులు, మరణాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశం వాస్తవాలను తొక్కి పెడుతున్నదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొవిడ్ కేసులు, మరణాలపై కచ్చితమైన డేటాను […]
విధాత: చైనాలో కొవిడ్ కేసులు, మరణాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశం వాస్తవాలను తొక్కి పెడుతున్నదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొవిడ్ కేసులు, మరణాలపై కచ్చితమైన డేటాను బైట పెట్టాలని అమెరికా మొదలు పాటు పలు దేశాలు డిమాండ్ చేశాయి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై చైనాకు కొన్ని సూచనలు చేసింది.
ప్రజాగ్రహంతో దిగివ వచ్చిన చైనా ప్రభుత్వం గత డిసెంబర్లో జీరో కొవిడ్ ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అక్కడ కొవిడ్ ఉధృతి రోజురోజుకూ పెరిగింది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవడం, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని, స్మశాన వాటికల్లో శవాలు గుట్టగుట్టలుగా పడి ఉన్న కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే కొవిడ్తో మరణించిన మృతుల సంఖ్యపై ఎట్టకేలకు డ్రాగన్ దేశం పెదవి విప్పింది. తమ దేశంలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకు సుమారు 60 వేల మంది కొవిడ్ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నట్టు ఆ దేశం వెల్లడించింది. ఈ మేరకు జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం నివేదికను అధికారికంగా విడుదల చేసింది.
కొవిడ్ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ విఫలమై 5,503 మంది, కొవిడ్ తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మరో 54,435 మంది మృతి చెందినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. మృతుల సగటు వయసు 80 ఏళ్లుగా పేర్కొన్నది. మరణించిన వారిలో 90 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారేనని వెల్లడించింది.
అయితే తాజాగా వెల్లడించిన గణాంకాలు ఆస్పత్రుల్లో చోటుచేసుకున్నవి మాత్రమేనని ఆరోగ్య కమిషన్ తెలిపింది. అయితే ఇళ్లలో కొవిడ్ మరణాలు సంభవించి ఉంటే అవి తాజాగా ప్రపంచ లెక్కల్లో కనిపించవు. దీన్నిబట్టి చూస్తే ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నట్టు చైనాలో చాలా కొవిడ్ మరణాలు సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది