అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వాక్సిన్ సరఫరా చేయాలన్న రాష్ట్రాలు- తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరిన మంత్రి హరీశ్రావు. బయోలజికల్- ఇ సహకారంతో 15లక్షల డోసులు సరఫరా చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం
విధాత: కోవిడ్ నివారణకు అతి ముఖ్యమైన వాక్సిన్ను రాష్ట్రాలకు సరఫరా చేయలేమని, ఎవరికి ఎంత అవసరమైతే అంత కొనుగోలు చేసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు కరోనా కట్టడిలో కీలకమైన వ్యాక్సిన్ను తమకు సరఫరా చేయాలని కేంద్ర మంత్రిని కోరాయి. ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు చేసిన విజ్ఞప్తికి స్పంధించిన కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ వ్యాక్సిన్ను సరఫరా చేయలేమని సొంతంగా కొనుగోలు చేయాలని చెప్పారు.
వ్యాక్సిన్ను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పడం ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్వహరించిన కేంద్రం అప్నమత్తంగా ఉండాలని ఉచిత సలహా ఇచ్చింది. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్య లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులోఉందన్నారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దంగా ఉందన్నారు. ప్రికాషనరీ డోసులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు చెప్పారు.
అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిల్వలు లేకుండా పోయినట్లు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని కోరిన మంత్రి, ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ మాట్లాడుతూ.. కావల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగా మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.
ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజిక్ ఇ ఎండీ మహిమా ధాట్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధన్య వాదాలు తెలిపారు.